Kollikuppdi Srinivas Rao: ఇకపై పొరపాట్లు జరగవు.. గతం గతః: కొలికపూడి
- కొలికపూడి, కేశినేని చిన్ని మధ్య కొంత కాలంగా విభేదాలు
- తన వల్ల పార్టీకి ఇబ్బంది కలిగినందుకు కొలికపూడి విచారం
- కులం కార్డు వాడటం తన అభిమతం కాదని స్పష్టీకరణ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గత కొంతకాలంగా టీడీపీలో సాగుతున్న రాజకీయ వివాదాలకు తెరపడినట్లు కనిపిస్తోంది. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్ని మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో, ఈరోజు అసెంబ్లీ లాబీల్లో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుని కొలికపూడి కలిశారు. నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా పరిణామాలు, పార్టీ ప్రతిష్ఠపై పడుతున్న ప్రభావంపై వీరు చర్చించారు. అనంతరం మీడియాతో పల్లా మాట్లాడుతూ కొలికపూడికి తాను చెప్పాల్సింది చెప్పానని అన్నారు.
అనంతరం కొలికపూడి మాట్లాడుతూ... గతంలో జరిగిన పొరపాట్లు ఇకపై పునరావృతం కావని, 'గతం గతః' అని ఆయన స్పష్టం చేశారు. తన చర్యల వల్ల పార్టీకి ఇబ్బంది కలిగినందుకు విచారం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో నియోజకవర్గ ఎంపీకి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తానని, ఆయన నుంచి కూడా అదే ఆశిస్తానని తెలిపారు. అలాగే, తన చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల వల్ల లేదా ఎంపీ అనుచరులు కొందరి వల్ల ఈ సమస్యలు తలెత్తి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కులం కార్డును వాడటం తన అభిమతం కాదని, ఆ విధానానికి తాను పూర్తిగా వ్యతిరేకమని కొలికపూడి స్పష్టం చేశారు. ఇకపై నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా నేరుగా జోనల్ కోఆర్డినేటర్ లేదా జిల్లా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటానని హామీ ఇచ్చారు.