Jogi Ramesh: జోగి రమేశ్ ను పరామర్శించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి.. కూటమి ప్రభుత్వంపై విమర్శలు

Buggana Rajendranath Reddy Criticizes Chandrababu Naidu Government Actions
  • జోగి రమేశ్ ఇంటిపై దాడులు జరుగుతుంటే పోలీసులు సైలెంట్ గా ఉన్నారన్న బుగ్గన
  • నేరస్తులకు రక్షణ కల్పిస్తున్నారా అని ప్రశ్న
  • అంబటిపై తప్పుడు కేసులు పెట్టారని మండిపాటు
  • అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్య
  • చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించాలని సూచన

రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు పరాకాష్ఠకు చేరాయని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసానికి వెళ్లిన బుగ్గన ఆయనను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... జోగి రమేశ్ ఇంటిపై పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులతో దాడులు జరుగుతుంటే పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడమే కాకుండా, దాడులు చేసే వారికి ఎస్కార్ట్ ఇవ్వడం దుర్మార్గమని విమర్శించారు. 


రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా లేక నేరస్థులకు రక్షణ కల్పిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. రాజకీయ దాడులను మహిళలు ముందుండి నడిపించడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నడూ చూడని కొత్త సంస్కృతి అని ఆయన అన్నారు. మహిళలతో అసభ్యకరంగా మాట్లాడించడం, దాడులు చేయించడం వెనుక పెద్దల 'కోచింగ్' ఉందని ఆరోపించారు.


మాజీ మంత్రి అంబటి రాంబాబు తన వ్యాఖ్యలపై పశ్చాత్తాపం వ్యక్తం చేసినప్పటికీ, ఆయనపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని బుగ్గన తప్పుబట్టారు. బాధితులపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని కూటమి నేతలు గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్ని రాష్ట్రం కోసం ఉపయోగించాలి కానీ, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టడానికి కాదని అన్నారు.

Jogi Ramesh
Buggana Rajendranath Reddy
Andhra Pradesh Politics
YS Jogi Ramesh
Chandrababu Naidu
TDP
YSRCP
Political Violence Andhra Pradesh
Ambati Rambabu
Andhra Pradesh Government

More Telugu News