ఇరాన్ అమెజాన్ డేటా సెంటర్లను టార్గెట్ చేసిందా?

  • ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెజాన్ డేటా సెంటర్లలో సమస్యలు
  • యూఏఈ, బహ్రెయిన్‌లోని క్లౌడ్ యూనిట్లలో నిలిచిన సేవలు
  • ఇరాన్ డ్రోన్లతో దాడి చేసిందన్న అంతర్జాతీయ మీడియా
  • ఈ ఘటనలపై అధికారికంగా ద్రువీకరించని అమెజాన్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, ప్రముఖ టెక్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన డేటా సెంటర్లలో కనెక్టివిటీ సమస్యలు తలెత్తాయి. యూఏఈ, బహ్రెయిన్‌లలోని అమెజాన్  క్లౌడ్ యూనిట్ డేటా సెంటర్లలో సేవలకు అంతరాయం కలగడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇరాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడంతో, ఈ సెంటర్లను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

వివరాల్లోకి వెళ్తే, తొలుత యూఏఈలోని అమెజాన్ డేటా సెంటర్‌పై ఓ అనుమానాస్పద వస్తువు పడటంతో మంటలు చెలరేగాయి. వాటిని అదుపులోకి తెచ్చినప్పటికీ, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో క్లౌడ్ సేవలు స్తంభించాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, వినియోగదారులు ప్రత్యామ్నాయ జోన్లను వాడుకోవాలని అమెజాన్ సూచించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే బహ్రెయిన్‌లోని అమెజాన్ సెంటర్‌లోనూ ఇలాంటి సమస్యలే పునరావృతమయ్యాయి. 

అయితే, ఈ అంతరాయాలకు గల కారణాలను అమెజాన్ అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, ఈ రెండు ఘటనల వెనుక ఇరాన్ డ్రోన్ దాడులే కారణమని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. ఇటీవల ఇరాన్‌పై దాడుల కోసం అమెరికా సైన్యం, అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి పనిచేస్తున్న ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐని ఉపయోగించిందని వార్తలు వచ్చాయి. దీనికి ప్రతీకారంగానే ఇరాన్.. అమెజాన్ డేటా సెంటర్లను లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
 


More Telugu News