Nara Lokesh: కాంగ్రెస్ కార్యకర్తల నిరసన దిగ్భ్రాంతి కలిగించింది: నారా లోకేశ్

Nara Lokesh Shocked by Congress Activists Protest
  • ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ ఆందోళనపై మంత్రి లోకేశ్ ఆగ్రహం
  • దేశ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారని తీవ్ర విమర్శ
  • ప్రతిష్టాత్మక వేదికలను రాజకీయాలకు వాడుకోవడం సరికాదన్న లోకేశ్
  • ఆవిష్కరణలపై దృష్టిపెట్టి దేశాన్ని నిర్మించుకోవాలని పిలుపు
ఢిల్లీలో నిన్న "ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026"లో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సృష్టించిన గందరగోళంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం, విచారం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికపై వారి ప్రవర్తన దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. ఏఐ రంగంలో ఎదుగుతున్న భారత్ శక్తిని ప్రపంచానికి చాటేందుకు ఉద్దేశించిన సదస్సులో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.

ఈ మేరకు లోకేశ్ ఒక ప్రకటన విడుదల చేశారు. "ఏఐ సూపర్ పవర్‌గా భారత్ ఎదుగుతున్న తీరును ప్రదర్శించేందుకు ఈ సదస్సు ఒక గొప్ప అవకాశం. అలాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ కార్యక్రమాన్ని రాజకీయ వేదికగా మార్చడం ద్వారా ప్రపంచం ముందు మనందరి ప్రతిష్ఠను తగ్గించారు. ఇది దిగ్భ్రాంతికరం, విచారకరం" అని లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

భారతదేశం ఇంతకంటే మెరుగైన గౌరవానికి అర్హమైనదని ఆయన అభిప్రాయపడ్డారు. "మనం ఇలాంటి చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి, ఆవిష్కరణలు, నైపుణ్యం ద్వారా దేశ నిర్మాణానికి ప్రాధాన్యత ఇద్దాం" అని లోకేశ్ పిలుపునిచ్చారు. దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయాల్లో రాజకీయాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు.
Nara Lokesh
India AI Impact Summit 2026
Youth Congress
AP Minister
Artificial Intelligence
AI Superpower
Delhi
Protest
Indian Politics

More Telugu News