చైనా రోబో డాగ్ కొని తామే అభివృద్ధి చేశామని ప్రచారం.. ఏఐ సదస్సులో యూనివర్సిటీ చీటింగ్

  • సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో బయటపడ్డ మోసం
  • గల్గోటియాస్‌ యూనివర్సిటీని సదస్సు నుంచి బహిష్కరించిన నిర్వాహకులు
  • విద్యార్థుల పరిశోధనల కోసమే వాడుతున్నట్లు వర్సిటీ వివరణ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ స్థాయి ‘ఏఐ ఇంపాక్ట్’ సదస్సులో ఓ యూనివర్సిటీ నిర్వాకంతో కలకలం రేగింది. చైనాకు చెందిన రోబో డాగ్‌ ను తమ ఆవిష్కరణగా ప్రదర్శించడమే ఈ కలకలానికి కారణం. ఉత్తరప్రదేశ్‌ కు చెందిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ ప్రతినిధులు ఈ నిర్వాకానికి పాల్పడ్డారు. సోషల్ మీడియాలో ఈ రోబోట్ వీడియోలు వైరల్ కాగా.. చైనాకు చెందిన రోబో డాగ్ ను పోలి ఉందని నెటిజన్లు గుర్తించడంతో యూనివర్సిటీ మోసం బయటపడింది. దీంతో యూనివర్సిటీపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. సదస్సు నుంచి ఆ విద్యాసంస్థను తక్షణమే గెంటివేసి, వారికి కేటాయించిన స్టాల్‌ను అధికారులు ఖాళీ చేయించారు.

అసలేం జరిగిందంటే..
గ్రేటర్ నోయిడాకు చెందిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ ఏఐ సదస్సులో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసింది. తమ విశ్వవిద్యాలయంలోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో 'Orion' పేరుతో ఒక రోబోడాగ్‌ను స్వయంగా అభివృద్ధి చేశామని వర్సిటీ ప్రతినిధులు ప్రచారం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మోసం బయటపడిందిలా..
యూనివర్సిటీ ప్రదర్శించిన రోబోడాగ్ చైనాకు చెందిన రోబోటిక్ కంపెనీ ‘యూనిట్రీ’ అభివృద్ధి చేసిన ‘Go2’ మోడల్‌ను పోలి ఉందని నెటిజన్లు గుర్తించారు. ఆన్‌లైన్‌ లో సుమారు రూ.2 లక్షల నుండి రూ.3 లక్షల ధరకు భారతీయులకూ ఈ రోబోడాగ్ అందుబాటులో ఉంది. దీంతో సదరు యూనివర్సిటీ మోసం బయటపడింది. విదేశీ టెక్నాలజీని కొనుగోలు చేసి, దానిని భారత్ ఆవిష్కరణగా ప్రచారం చేసుకోవడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

యూనివర్సిటీ ఏమంటోందంటే..
వివాదం ముదరడంతో యూనివర్సిటీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది. తాము దానిని చైనా నుంచే కొనుగోలు చేశామని చెప్పింది. విద్యార్థుల పరిశోధనల కోసం ఒక సాధనంగా మాత్రమే వాడుతున్నామని పేర్కొంది. ఆ రోబో డాగ్ ను తామే అభివృద్ధి చేశామని ఎక్కడా ప్రచారం చేసుకోలేదని పేర్కొంది. అయితే, సోషల్ మీడియాలో ఉన్న వీడియోల్లో మాత్రం ఆ విద్యాసంస్థ ప్రతినిధులు ఇది తమ సొంత ఆవిష్కరణ అని స్పష్టంగా చెప్పడం గమనార్హం.

కేంద్రం సీరియస్.. కఠిన చర్యలు
అంతర్జాతీయ ప్రతినిధులు, టెక్ దిగ్గజాలు హాజరైన సదస్సులో ఇలాంటి తప్పుదారి పట్టించే చర్యలకు పాల్పడటంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన గల్గోటియాస్‌ యూనివర్సిటీ స్టాల్‌ను తొలగించి, సదస్సు నుంచి వారికి ఉద్వాసన పలికింది.


More Telugu News