Errabelli Dayakar Rao: తొర్రూరులో ఉద్రిక్తత... ఎర్రబెల్లి దయాకర్ రావు పీఏపై దాడి

మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా ఆయా పార్టీలకు స్పష్టమైన మెజారిటీ ఉన్న చోట ఎన్నిక సజావుగా సాగుతోంది. హంగ్ వచ్చిన చోట ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. తొర్రూర్‌లో 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 9, కాంగ్రెస్ 7 వార్డులను గెలుచుకున్నాయి. ఎక్స్‌అఫీషియో సభ్యుల వివాదం లేకుంటే ఇక్కడ బీఆర్ఎస్ ఛైర్‌పర్సన్‌ను దక్కించుకోవాలి.

కానీ స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, ఎంపీ కడియం కావ్యలు ఎక్స్అఫీషియోలుగా పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో రెండు పార్టీల బలాలు సమానమయ్యాయి. డ్రా ద్వారా ఎన్నికను నిర్వహించే అవకాశముంది.

అయితే కడియం కావ్య ఇదివరకే వరంగల్‌లో ఎక్స్అఫీషియోగా నమోదు చేసుకున్నారని, ఇప్పుడు మళ్లీ తొర్రూరులో ఎలా చేసుకుంటారని బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పోటాపోటీగా నినాదాలు చేశారు. వారిమధ్య తోపులాట జరిగింది.

ఆ సమయంలో అక్కడకు కడియం కావ్య, యశస్వినిరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చేరుకున్నారు. ఈ క్రమంలో ఎర్రబెల్లి పీఏపై కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. కడియం కావ్య రెండుచోట్ల ఎక్స్ అఫీషియోగా నమోదు చేయించుకోవడంపై బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.
Errabelli Dayakar Rao
Thorrur
Mahabubabad
Telangana Municipal Elections
Kadiyam Kavya
Yashaswini Reddy

More Telugu News