Revanth Reddy: 'నేనే రాజు నేనే మంత్రి' అని ఎందుకు అన్నానంటే..!: రేవంత్ రెడ్డి స్పష్టీకరణ

'నేనే రాజు నేనే మంత్రి' అంటూ తాను ఇటీవల చేసిన వ్యాఖ్యలపై విపక్ష నాయకులు విమర్శలు గుప్పించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఇటీవల విలేకరులతో పిచ్చాపాటిగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 'నేనే రాజు నేనే మంత్రి' అని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు విమర్శలు గుప్పించారు.

దీంతో రేవంత్ రెడ్డి తాజాగా ఆ వ్యాఖ్యలపై స్పష్టతను ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన అన్నారు. గెలుపు, ఓటమి అన్నింటికీ తానే బాధ్యత తీసుకుంటాననే ఉద్దేశంలో చెప్పానని ఆయన వెల్లడించారు. కానీ దానిని మరోలా అర్థం చేసుకున్నారని తెలిపారు.

సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నేను ఎప్పుడూ పాలకుడిగా ప్రవర్తించలేదని, సేవకుడిగానే భావిస్తున్నానని అన్నారు. ప్రజలు తమకు సేవ చేయడానికి ఓటు వేసి గెలిపించారని పేర్కొన్నారు. అందుకే రాజకీయ నాయకులు పాలకులుగా భావించుకోవద్దని, సేవకులుగానే ఉండాలని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిపై విపక్షాలు ప్రజలను నిందిస్తున్నాయని విమర్శించారు.

రాష్ట్రంలో అన్ని తండాలకు బీటీ రోడ్లు వేయాలని ఆదేశాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి తండాలో పాఠశాల భవనాలు ఉండాలని అన్నారు. తండాలకు సోలార్ ప్లాంట్ల ద్వారా కరెంట్ విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని అన్నారు. తాము సంక్షేమంతో పాటు విద్యార్థులకు మంచి విద్య కూడా ఇవ్వాలనుకుంటున్నామని అన్నారు. చదువుకుంటేనే మంచి ఉద్యోగాలు, కీలక పదవులు వస్తాయని అన్నారు.
Revanth Reddy
Telangana CM
Nene Raju Nene Mantri
KTR criticism
Kalvakuntla Kavitha
Telangana politics

More Telugu News