KTR: బీఆర్ఎస్ మంచి ఫలితాలు సాధించింది.. కొత్తగూడెంలో వారికి ఓపెన్ ఆఫర్ ఇచ్చాం: కేటీఆర్

KTR BRS Achieved Good Results Open Offer to CPI in Kothagudem
  • 30 శాతానికి పైగా స్థానాలు గెలుచుకున్నామన్న కేటీఆర్
  • కొత్తగూడెంలో సీపీఐ పార్టీకి మద్దతిస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చామన్న కేటీఆర్
  • తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయమని ప్రజలు స్పష్టం చేశారన్న కేటీఆర్
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మంచి ఫలితాలను సాధించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గత ఏడాది చివరలో జరిగిన పంచాయతీ, ఇప్పుడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టామని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 4 వేలకు పైగా స్థానాలు గెలుచుకున్నామని, ఇప్పుడు 2,500 మున్సిపల్ వార్డుల్లో 750 వరకు గెలుచుకుంటున్నామని అన్నారు. మొత్తంగా 30 శాతానికి పైగా సీట్లు గెలిచామని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికార బలాన్ని ఉపయోగించి కొన్ని స్థానాలను దక్కించుకుందని ఆరోపించారు. గద్వాలలో ఒక వార్డులో నాలుగుసార్లు రీకౌంటింగ్ చేయించి కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటుతో గెలిచినట్లు ప్రకటించారని... గద్వాల, చౌటుప్పల్‌లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని గెలిచారని ఆరోపించారు. కొన్నిచోట్ల తమ కౌన్సిలర్లను ఎత్తుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ అనేక తంటాలు పడుతోందని అన్నారు.

116 మున్సిపాలిటీల్లో తాము సొంతంగా 15 నుంచి 16 గెలుచుకున్నామని కేటీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఈ ఎన్నికల కోసం వీరోచిత పోరాటం చేశారని ప్రశంసించారు. ప్రజలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి ఓటేశారని, కానీ కాంగ్రెస్ పార్టీ మోసంతో ఎక్కువ స్థానాలు గెలుచుకుంటోందని అన్నారు.

సీపీఐ పార్టీకి ఓపెన్ ఆఫర్ ఇచ్చాం

కొత్తగూడెం కార్పొరేషన్‌లో 60 స్థానాలకు గాను సీపీఐ 29 సీట్లు గెలుచుకుందని, తాము 8 నుంచి 10 చోట్ల గెలిచామని కేటీఆర్ అన్నారు. సింగరేణిలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కొత్తగూడెంలో తాము బేషరతుగా సీపీఐకి మద్దతిస్తామని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఎమ్మెల్యే సాంబశివరావుతో మాట్లాడినట్లు చెప్పారు. సింగరేణిలో రూ.6 వేల కోట్ల బొగ్గు కుంభకోణం జరిగిందని, దీనిని అడ్డుకునేందుకు మీతో కలిసి వస్తామని సీపీఐకి ఓపెన్ ఆఫర్ ఇచ్చామని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి సింగరేణికి అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ దోపిడీ చేస్తుంటే బీజేపీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు.

మేం మాత్రమే ప్రత్యామ్నాయం

తెలంగాణలో బీఆర్ఎస్ మాత్రమే ప్రత్యామ్నాయమని ప్రజలు నిన్న పంచాయతీ, నేడు మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో స్పష్టం చేశారని కేటీఆర్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మాత్రమే సమస్యలపై పోరాడుతుందని ప్రజలు తేల్చి చెప్పారని అన్నారు. కలిసొచ్చే లౌకికవాద పార్టీలను కలుపుకును ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఇదే ఉత్సాహంతో జీహెచ్ఎంసీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉందనడానికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. ఓడిపోయిన వారు నిరాశపడవద్దని ఆయన సూచించారు. అధికార పార్టీ అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో 80 నుంచి 90 సీట్లు గెలుచుకోవాలని అన్నారు. బీఆర్ఎస్ 15, హంగ్ 30 మున్సిపాలిటీలు పోను కాంగ్రెస్ ఎన్ని గెలుచుకుందో ఆలోచించాలని అన్నారు.
KTR
BRS Party
Telangana Municipal Elections
CPI Party
Kothagudem Corporation
Singareni Collieries

More Telugu News