India Pakistan Match: వీడిన ఉత్కంఠ.. 15న భారత్-పాక్ మ్యాచ్ యథాతథం

India Pakistan Match Confirmed for February 15 T20 World Cup
  • భారత్‌తో టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడతామన్న పాకిస్థాన్
  • యూటర్న్ తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పాక్ ప్రభుత్వం
  • స్నేహపూర్వక దేశాల అభ్యర్థన మేరకే ఈ నిర్ణయమన్న పాక్
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న టీమిండియాతో తలపడేందుకు తమ జాతీయ క్రికెట్ జట్టుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హైవోల్టేజ్ మ్యాచ్‌కు మార్గం సుగమమైంది.

సోమవారం రాత్రి ఈ మేరకు పాక్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. స్నేహపూర్వక దేశాల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, బహుళపక్ష చర్చల్లో సాధించిన ఫలితాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. క్రికెట్ స్ఫూర్తిని కాపాడటంతో పాటు, ఈ గ్లోబల్ క్రీడ కొనసాగింపునకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించింది.

భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించడంతో, ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించారు. దీనికి సంఘీభావంగా తాము భారత్‌తో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ మొదట ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు ఐసీసీ, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ), బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) మధ్య ఉన్నతస్థాయి చర్చలు జరిగాయి. బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాలు కూడా ఈ మ్యాచ్ ఆడి తీరాలని పాక్‌ను కోరాయి. శ్రీలంక అధ్యక్షుడు కూడా పాక్ ప్రధానితో ఫోన్‌లో మాట్లాడటంతో ఈ సంక్షోభం ముగిసింది.

ఈ నిర్ణయంతో, శ్రీలంకలోని కొలంబో వేదికగా ఫిబ్రవరి 15న జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ యథాతథంగా జరగనుంది. పాకిస్థాన్ తన టోర్నమెంట్ కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుంటుందని ఐసీసీ కూడా ఓ ప్రకటనలో ధ్రువీకరించింది.
India Pakistan Match
T20 World Cup
Pakistan Cricket
ICC
PCB
Bangladesh Cricket Board
Sri Lanka
Cricket Tournament
India vs Pakistan
Colombo

More Telugu News