'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్'.. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన సీషెల్స్
- ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం
- 'గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్' అవార్డుతో సత్కారం
- పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి గుర్తింపుగా ఈ గౌరవం
- సెషెల్స్కు 'మేడ్ ఇన్ ఇండియా' గస్తీ నౌక, వాహనాలు అందజేత
- మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్లో ప్రధాని
ప్రస్తుతం ప్రధాని మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం సీషెల్స్లో ఉన్నారు. ఆ దేశ జాతీయ దినోత్సవ స్వర్ణోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పర్యటనలో భాగంగా ఆయన సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మినితో సమావేశమయ్యారు. అంతకుముందు, ప్రధానికి స్టేట్ హౌస్లో గౌరవ వందనం లభించింది.
ఈ సందర్భంగా, 'మేడ్ ఇన్ ఇండియా' ఫాస్ట్ ప్యాట్రోల్ వెసెల్ (FPV) పీఎస్ లెస్ప్వార్తో పాటు ఆరు అంబులెన్స్లు, 10 యుటిలిటీ వాహనాలు, ఐదు లేజర్ రేడియల్ బోట్లను సీషెల్స్కు ప్రధాని మోదీ అందజేశారు. ఈ సహాయం సీషెల్స్ సముద్ర నిఘా సామర్థ్యాన్ని బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ పేర్కొంది. అనంతరం ఇరు దేశాల నేతలు కలిసి సీషెల్స్ నేషనల్ బొటానికల్ గార్డెన్లో అరుదైన 'కోకో డి మెర్' మొక్కను నాటారు.
కాగా, ప్రధాని మోదీకి అంతర్జాతీయ పురస్కారాలు రావడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో ఆహార భద్రతకు చేసిన సేవలకు గాను ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (FAO) అత్యున్నత పురస్కారం 'అగ్రికోలా మెడల్' అందుకున్నారు. గతంలో 2018లో సియోల్ శాంతి బహుమతి, ఐక్యరాజ్యసమితి 'ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్' అవార్డులు కూడా ఆయనను వరించాయి.