యూపీఎస్సీ పరీక్షలకు కొత్త నిబంధన.. ఇకపై ఫేస్ అథెంటికేషన్
- పరీక్షల్లో పారదర్శకత, భద్రత పెంచేందుకే ఈ నిర్ణయం
- పైలట్ ప్రాజెక్టులో 10 సెకన్లలోనే అభ్యర్థి వెరిఫికేషన్ పూర్తి
- ఏఐ టెక్నాలజీతో అక్రమాలకు చెక్ పెట్టనున్న యూపీఎస్సీ
పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీని యూపీఎస్సీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షించింది. 2025 సెప్టెంబర్ 14న జరిగిన ఎన్డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), ఎన్ఏ (నావల్ అకాడమీ) II, సీడీఎస్ (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) II పరీక్షల్లో ఈ పైలట్ ప్రోగ్రాంను విజయవంతంగా నిర్వహించింది. గురుగ్రామ్లోని ఎంపిక చేసిన కేంద్రాల్లో అభ్యర్థుల ముఖాలను డిజిటల్గా స్కాన్ చేసి, వారి దరఖాస్తు ఫారాల్లోని ఫొటోలతో సరిపోల్చారు.
ఈ కొత్త విధానంపై యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, దీనివల్ల ఒక్కో అభ్యర్థి వెరిఫికేషన్ సమయం సగటున 8 నుంచి 10 సెకన్లకు తగ్గిందని తెలిపారు. ఇది సమయం ఆదా చేయడంతో పాటు పరీక్షలకు అదనపు భద్రతను అందిస్తుందని వివరించారు.
దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి ఉన్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ సహా పలు నియామక పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.