Anagani Satya Prasad: ఆ 5 రకాల భూములు 22ఏ జాబితా నుంచి తొలగింపు... ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం నూతన సంవత్సరంలో కీలకమైన శుభవార్త అందించింది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లకు తీవ్ర ఆటంకంగా మారిన 22ఏ నిషిద్ధ జాబితా నుంచి 5 రకాల భూములను తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గురువారం తన శాఖలో తొలి సంతకం చేశారు.

మంత్రి ఆదేశాల ప్రకారం, ప్రైవేట్ పట్టా భూములను 22ఏ జాబితా నుంచి సంపూర్ణంగా తొలగించారు. ఈ భూములకు సంబంధించి ఎవరైనా దరఖాస్తు చేసినా లేదా చేయకపోయినా, అధికారులే సుమోటోగా చర్యలు తీసుకుని జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. అదేవిధంగా, సరైన పత్రాలు ఉన్న మాజీ, ప్రస్తుత సైనిక ఉద్యోగుల భూములతో పాటు స్వాతంత్ర్య సమరయోధుల భూములను కూడా ఈ నిషిద్ధ జాబితా నుంచి మినహాయించాలని ఆదేశాలు జారీ చేశారు. మిగిలిన భూములపై త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం)లో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ, భూ యజమానుల హక్కులను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతున్నామని వివరించారు. ఫ్రీహోల్డ్ భూములపై రెండు నెలల్లో సానుకూల నిర్ణయం తీసుకుంటామని, ఫిబ్రవరి నుంచి దీని అమలు ప్రారంభమవుతుందని హామీ ఇచ్చారు. జనవరి 2 నుంచి ఇంటింటికీ వెళ్లి రైతులకు కొత్త పాస్‌బుక్‌లు అందజేయనున్నట్లు ప్రకటించారు.

భూ అక్రమాలను అరికట్టేందుకు ఆధార్‌తో సర్వే నంబర్‌ను అనుసంధానం చేసే ప్రక్రియ కొనసాగుతోందని, దీని కోసం ప్రత్యేక యాప్‌ను కూడా తీసుకువస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. భూ వివాదాల్లో తప్పు చేసిన అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది రైతులకు, భూ యజమానులకు పెద్ద ఊరట లభించనుంది. భూ లావాదేవీలు ఇకపై సులభతరం అవుతాయని అంచనా వేస్తున్నారు.
Anagani Satya Prasad
Andhra Pradesh
AP government
22A list
land registration
land owners
farmers
revenue department
land issues
property rights

More Telugu News