పోక్సో కేసు: బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండ్.. చర్లపల్లి జైలుకు తరలింపు

Bandi Bhagirath Remanded 14 Days in POCSO Case Transferred to Cherlapally Jail
  • మే 29 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ మేడ్చల్ కోర్టు ఉత్తర్వులు
  • శనివారం రాత్రి అప్పా జంక్షన్ వద్ద భగీరథ్‌ను అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
  • కొడుకును తానే పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ ప్రకటన
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు న్యాయమూర్తి పోక్సో కేసులో 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. శనివారం రాత్రి నాటకీయ పరిణామాల మధ్య అరెస్టయిన ఆయనను, మేడ్చల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మే 29 వరకు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.

మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలతో భగీరథ్‌పై మే 8న పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు తొలుత సాధారణ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినప్పటికీ, తర్వాత తీవ్రమైన పోక్సో చట్టంలోని సెక్షన్ 5(l) రెడ్ విత్ సెక్షన్ 6 కిందకు మార్చారు.

శనివారం రాత్రి 8:15 గంటల సమయంలో హైదరాబాద్‌లోని అప్పా జంక్షన్ వద్ద భగీరథ్‌ను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించి రెండు గంటలకు పైగా విచారించారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి చేసి, అర్ధరాత్రి సమయంలో మేడ్చల్ మేజిస్ట్రేట్ నివాసంలో హాజరుపరిచారు.

భగీరథ్ అరెస్ట్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. గాలింపు చర్యల తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, కేంద్ర మంత్రి బండి సంజయ్ దీనిపై స్పందిస్తూ, "చట్టం, న్యాయవ్యవస్థపై గౌరవంతో, ఈరోజు మా న్యాయవాదుల ద్వారా నా కొడుకు బండి భగీరథ్‌ను విచారణ కోసం తెలంగాణ పోలీసుల ముందు హాజరుపరిచాను. నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు" అని మీడియాకు తెలిపారు.
Go Back to Shorts
Bandi Bhagirath
Bandi Sanjay
POCSO Act
minor girl
sexual assault case
Telangana police
Cyberabad police
Cherlapally Jail
judicial remand

More Telugu News