గ్రేటర్ హైదరాబాద్ లో ఈకేవైసీ చేసుకోకుంటే రేషన్ కట్
- హైదరాబాద్ లోని రేషన్ లబ్ధిదారులకు డీలర్ల హెచ్చరిక
- దగ్గర్లోని రేషన్ షాపుల్లో వేలిముద్రలు ఇవ్వాలని సూచన
- పాత కార్డులతో పాటు కొత్త కార్డుదారులకూ తప్పనిసరి
కొత్తగా రేషన్ కార్డు పొందిన వారితో పాటు పాత కార్డుల్లో కొత్తగా పేరు నమోదు చేయించుకున్న సభ్యులు తప్పకుండా ఈ– కేవైసీ చేయించుకోవాలని డీలర్లు చెబుతున్నారు. ఈ కేవైసీ చేసుకోని వారికి రేషన్ సరుకులు నిలిపివేస్తామని పౌరసరఫరాల శాఖ మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. వచ్చే నెల కోటా పూర్తయ్యేలోపైనా ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ- కేవైసీ ఎందుకంటే..
రేషన్ కార్డు లబ్ధిదారుల్లో బినామీలు, బోగస్ కార్డులను గుర్తించేందుకే రేషన్ కార్డులో పేర్లు ఉన్న ప్రతీ సభ్యుడూ ఈకేవైసీ చేయించాలన్న నిబంధన అమలు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. డూప్లికేట్ కార్డులు, చనిపోయిన యూనిట్ల ఏరివేత కార్యక్రమంలో భాగంగానే ఈ కేవైసీ చేస్తున్నట్లు తెలిపారు. ఆధార్ అప్డేట్ లేకపోవడం వల్ల బయోమెట్రిక్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ– కేవైసీతో ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని వివరించారు.