10 మంది ట్రంప్లు వచ్చినా ఏం చేయలేరు: ఆఫ్ఘన్ ఇమిగ్రేషన్ బ్యాన్ పై అమెరికా మాజీ సైనికుడు
- వాషింగ్టన్ కాల్పుల తర్వాత ఆఫ్ఘన్లపై ట్రంప్ కఠిన చర్యలు
- ఆఫ్ఘన్లకు గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియ నిలిపివేత
- ఒకరి తప్పుకు దేశాన్ని నిందించడం అన్యాయమన్న మాజీ సైనికుడు
కాల్పుల ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ట్రంప్ స్పందిస్తూ.. ఆఫ్ఘన్ జాతీయులకు గ్రీన్ కార్డుల జారీ ప్రక్రియను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆఫ్ఘనిస్థాన్ను ఒక "నరక కూపం"గా అభివర్ణించారు. దీంతో పాటు ఆఫ్ఘనిస్థాన్, మయన్మార్, ఇరాన్, వెనెజువెలా సహా 19 దేశాల నుంచి వచ్చిన వలసదారుల వివరాలపై విస్తృత సమీక్షకు ఆదేశాలు జారీ చేశారు.
ట్రంప్ చర్యలను మోహిబి తప్పుబట్టారు. "ఒక వ్యక్తి తుపాకీతో దాడి చేసినంత మాత్రాన ఆఫ్ఘన్ ప్రజలంతా ఉగ్రవాదులు కాదు. అందరినీ శిక్షించడం సరికాదు" అని ఆయన అన్నారు. 2021లో అమెరికా సేనల ఉపసంహరణ సమయంలో నెలకొన్న గందరగోళ పరిస్థితులే ప్రస్తుత సమస్యలకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా వలసల విధానం పూర్తిగా విఫలమైందని... పది మంది ట్రంప్లు వచ్చినా ఈ సమస్యను పరిష్కరించలేరని ఆయన వ్యాఖ్యానించారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కాల్పులకు పాల్పడిన రహ్మానుల్లా లకన్వాల్.. స్పెషల్ ఇమ్మిగ్రెంట్ వీసా (SIV) ప్రోగ్రామ్ కింద అమెరికాకు రాలేదు. తాలిబన్లు అధికారం చేపట్టాక, నాటి అధ్యక్షుడు జో బైడెన్ ప్రారంభించిన 'ఆపరేషన్ అలైస్ వెల్కమ్' కార్యక్రమం ద్వారా అమెరికా చేరుకున్నాడు. గతంలో సీఐఏతో కూడా పనిచేసిన లకన్వాల్, 2024లో శరణార్థి హోదా కోసం దరఖాస్తు చేసుకోగా, ఈ ఏడాది ట్రంప్ పరిపాలనలోనే ఆమోదం లభించడం గమనార్హం.
ఈ ఘటనను సాకుగా చూపి ప్రభుత్వం చాలాకాలంగా అమలు చేయాలనుకుంటున్న విధానాలను ముందుకు తెస్తోందని 'ఆఫ్ఘన్ఇవాక్' అధ్యక్షుడు షాన్ వాన్డైవర్ ఆరోపించారు. అమెరికా వలసల విధానంలోని వైఫల్యం ఏ ఒక్క అధ్యక్షుడిదో కాదని, ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న వ్యవస్థాగత లోపమని విశ్లేషకులు అంటున్నారు.