సిమ్ కార్డుల విషయంలో సరికొత్త మోసం.. అప్రమత్తంగా లేకుంటే అంతే..!
- సైబర్ నేరస్థులతో జట్టుకట్టి కొంతమంది వ్యాపారుల అక్రమాలు
- ఆధార్ కోసం వేలిముద్రలు తీసుకుంటూ మోసం
- మరో సిమ్ యాక్టివేట్ చేసి సైబర్ నేరస్థులకు చేరవేత
ఆధార్ వేలిముద్రలు తీసుకుంటూ..
కొత్త సిమ్కార్డును యాక్టివేట్ చేయాలంటే ఆధార్ కార్డు వివరాలు, వేలిముద్రలు ఇవ్వాలనే విషయం తెలిసిందే. సరిగ్గా మోసం ఇక్కడే జరుగుతోంది. వేలిముద్రలు, ఐరిస్ సేకరించే సమయంలో స్కానింగ్ ప్రక్రియను ఒకటికి రెండుసార్లు చేస్తారు. తద్వారా ఒకేసారి రెండు సిమ్ లను యాక్టివేట్ చేస్తున్నారు. ఒక సిమ్ మీ చేతుల్లోకి, మరో సిమ్ కార్డు సైబర్ నేరస్థుల ముఠా వద్దకు చేరుతోంది.
ఎలా అడ్డుకోవచ్చంటే..
సిమ్ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం ‘సంచార్ సాథీ’ మొబైల్ యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఇందుకోసం https://www.sancharsaathi.gov.in వెబ్సైట్ను సందర్శించి దానిపై క్లిక్ చేయాలి. ‘నో మొబైల్ కనెక్షన్స్ ఇన్ యువర్ నేమ్ (know mobile connections in your name)’ పై క్లిక్ చేసి మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరుతో నమోదైన సిమ్కార్డు నెంబర్లు కనిపిస్తాయి. ఆ నెంబర్లను మీరు ఇంకా వాడుతుంటే సరే.. అందులో మీరు ఎప్పుడూ వాడని నెంబర్ కనిపించినా, గతంలో వాడి పక్కన పడేసిన నెంబర్ ఉన్నా అప్రమత్తం కావాల్సిందే. ఆ నెంబర్ల పక్కన కనిపించే ‘నాట్ మై నంబర్’ ‘నాట్ రిక్వైర్డ్’ ఆప్షన్లపై క్లిక్ చేయడం ద్వారా మీ పేరుతో సిమ్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టవచ్చు.