బీహార్లో ముగిసిన తొలి విడత పోలింగ్.. డిప్యూటీ సీఎంకు చేదు అనుభవం
- బీహార్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి
- సాయంత్రం 5 గంటల వరకు 60.13 శాతం ఓటింగ్ నమోదు
- తొలి దశలో 121 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు
- డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా కారుపై దాడి
- లఖిసరాయ్ నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఉద్రిక్తత
- ఈ నెల11న రెండో దశ పోలింగ్.. 14న ఓట్ల లెక్కింపు
డిప్యూటీ సీఎం కారుపై దాడికి యత్నం
తొలి విడత పోలింగ్ ప్రక్రియ దాదాపు ప్రశాంతంగానే ముగిసినప్పటికీ, లఖిసరాయ్ నియోజకవర్గంలో మాత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారుపై కొందరు వ్యక్తులు దాడికి యత్నించారు.
లఖిసరాయ్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. కొందరు వ్యక్తులు ఆయన కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. విజయ్ కుమార్ సిన్హా వాహనంపై చెప్పులు, పేడ విసిరి, 'ముర్దాబాద్' అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆయన వాహనం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక్క ఘటన మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరిగినట్లు అధికారులు తెలిపారు.