ఏపీ పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం భారీ నిధులు... పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారులకు కేంద్రం భారీ చేయూత
- ప్రత్యేక సాయం కింద రూ.2000 కోట్లు మంజూరు
- పనుల నాణ్యతపై రాజీపడొద్దని అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశం
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రహదారుల నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పనులు చేపట్టే కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ అధికారులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు. నిర్మాణం ప్రారంభమైనప్పటి నుంచి పలు దశల్లో నాణ్యతను తనిఖీ చేయడం తప్పనిసరి అని తెలిపారు. ప్రమాణాలకు విరుద్ధంగా పనులు చేపట్టినా, ఏవైనా అవకతవకలు జరిగినట్టు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
అలాగే, పుట్టపర్తిలో జరగనున్న శ్రీ సత్య సాయిబాబా శత జయంతి ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని అక్కడి పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధికి ప్రత్యేకంగా రూ.35 కోట్లు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ సహకారం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకత్వంతో ప్రతి గ్రామానికీ పటిష్టమైన, దీర్ఘకాలం మన్నే రహదారులను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.