అతడు జైల్లో ఉండాల్సిన వ్యక్తి: ట్రంప్

  • షికాగో మేయర్, ఇల్లినోయా గవర్నర్ పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు
  • దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారంటూ మండిపాటు
  • డెమోక్రటిక్‌ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో భద్రతా దళాలను మోహరించడం అన్యాయమన్న ఇల్లినోయీ గవర్నర్‌
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకెక్కారు. షికాగో మేయర్ బ్రాండన్ జాన్సన్, ఇల్లినాయి గవర్నర్ జేబీ ఫ్రిట్కర్‌లపై తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు.

ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ICE) అధికారులకు భద్రత కల్పించడంలో వారు విఫలమయ్యారని ట్రంప్ ఆరోపించారు. "వారిని జైలులో పెట్టాలి, దేశ భద్రతను ప్రమాదంలోకి నెట్టారు" అంటూ ఆయన తన 'ట్రూత్ సోషల్' వేదికలో పోస్ట్ చేశారు.

జాతీయ భద్రతా దళాల మోహరింపు

ఇటీవల ట్రంప్ ప్రభుత్వం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలను మోహరిస్తోంది. అక్రమ వలసదారులపై దాడులు, తనిఖీల నేపథ్యంలో ఈ చర్యలు చేపడుతున్నారు. షికాగోలో ఇమ్మిగ్రేషన్ అధికారుల తనిఖీలకు వ్యతిరేకంగా స్థానికులు నిరసనలు చేస్తుండటంతో, కేంద్ర బలగాలను అక్కడికి పంపించారు.

గవర్నర్ ఫ్రిట్కర్ ప్రతిస్పందన

ఈ చర్యపై ఇల్లినాయి గవర్నర్ జేబీ ఫ్రిట్కర్ తీవ్రంగా స్పందించారు. "డెమోక్రటిక్ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో జాతీయ భద్రతా దళాలను మోహరించడం పూర్తిగా అన్యాయం, దారుణం" అని వ్యాఖ్యానించారు.

పలు నగరాల్లో బలగాల మోహరింపు

రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ దేశంలోని పలు నగరాలకు కేంద్ర బలగాలను పంపించారు. వాటిలో బాల్టిమోర్, మెంఫిస్, వాషింగ్టన్ డీసీ, న్యూ ఆర్లీన్స్, ఓక్‌లాండ్, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెలెస్, షికాగో ప్రధానమైనవి.

అయితే, పోర్ట్‌లాండ్ నగరానికి బలగాలను పంపాలన్న నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు నిలిపివేసింది, చిన్నస్థాయి ఆందోళనలను కారణంగా చూపి కేంద్ర బలగాలను పంపడం "అనుచితం" అని వ్యాఖ్యానించింది. 


More Telugu News