BCCI Umpire: కోహ్లీతో ప్రపంచకప్ గెలిచారు.. ఇప్పుడు అంపైర్లుగా కొత్త ఇన్నింగ్స్

Kohlis Teammates U19 World Cup Stars Tanmay and Ajitesh Become Umpires
షార్ట్స్‌లో చూడండి
సుమారు 17 ఏళ్ల క్రితం కౌలాలంపూర్‌లో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ నాయకత్వంలోని భారత జట్టు విజేతగా నిలిచింది. ఆ జట్టులో కీలక పాత్ర పోషించిన తన్మయ్ శ్రీవాస్తవ, అజితేశ్‌ అర్గల్ ఇప్పుడు మళ్లీ క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టారు. అయితే, ఈసారి ఆటగాళ్లుగా కాదు, అంపైర్లుగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒకవైపు విరాట్ కోహ్లీ ఇప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తూ స్టార్‌గా వెలుగొందుతుండగా, అతని సహచరులు అంపైర్లుగా తమ రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టడం ఆసక్తికరంగా మారింది.

2008లో జరిగిన ఆ ప్రపంచకప్‌లో ఎడమచేతి వాటం ఓపెనర్ అయిన తన్మయ్ శ్రీవాస్తవ 262 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా, మీడియం పేసర్ అజితేశ్‌ అర్గల్ ఫైనల్‌లో అద్భుతంగా రాణించి 'ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్'గా నిలిచాడు. ఇన్నాళ్ల తర్వాత వీరిద్దరూ కాన్పూర్‌లో జరిగిన భారత్ 'ఏ', ఆస్ట్రేలియా 'ఏ' జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు అంపైర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు.

2023లో బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన తన్మయ్, అజితేశ్‌.. ఇప్పటికే రంజీ ట్రోఫీ, విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ వంటి దేశవాళీ టోర్నీలలో అంపైరింగ్ చేశారు. ఇప్పుడు భారత్ 'ఏ' సిరీస్‌తో అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. గతంలో తన్మయ్ ఐపీఎల్‌లో అంపైరింగ్ చేయడంతో పాటు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టాలెంట్ స్కౌట్‌గా కూడా పనిచేశాడు.

క్రికెటర్లుగా వీరి కెరీర్లను పరిశీలిస్తే, అజితేశ్‌ అర్గల్ కేవలం 10 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ తన్మయ్ శ్రీవాస్తవ ఉత్తరప్రదేశ్ జట్టు తరఫున దాదాపు పదేళ్లపాటు ఆడి 90 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో సత్తా చాటాడు. ప్రస్తుతం భారత అంపైర్లలో నితిన్ మీనన్ మాత్రమే ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో తమ నిలకడైన ప్రదర్శనతో ముందుగా ఐసీసీ ఎమిరేట్స్ ప్యానెల్‌కు, ఆ తర్వాత ఎలైట్ ప్యానెల్‌కు ఎంపికవ్వాలని ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Go Back to Shorts
BCCI Umpire
Tanmay Srivastava
Virat Kohli
U19 World Cup
Ajitesh Argal
India A
Australia A
Ranji Trophy
Cricket Umpiring
Indian Cricket

More Telugu News