Komatireddy Raj Gopal Reddy: నాపై ఇంటెలిజెన్స్ నిఘా: సొంత ప్రభుత్వంపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన ఆరోపణలు

తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సొంత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేసి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. ప్రభుత్వం తనపై నిఘా పెట్టిందని, తన ప్రతి కదలికను ఇంటెలిజెన్స్ వర్గాలు గమనిస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాను ఏం మాట్లాడినా రాష్ట్రంలో సంచలనమవుతోందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తన కార్యకలాపాలపై ప్రత్యేకం దృష్టి సారించిందని రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. తాను ఎక్కడికి వెళుతున్నది, ఏం చేస్తున్నది అనే విషయాలపై నిరంతరం నిఘా కొనసాగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తాను ఎలాంటి రాజకీయ నిర్ణయాలు తీసుకుంటానోనని ప్రభుత్వంలో ఆసక్తి నెలకొందని, అందులో భాగంగానే ఈ నిఘా ఏర్పాటు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే, తనపై ఎన్ని నిఘాలు పెట్టినా ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రస్తుతానికి ఎలాంటి చర్యలకు పాల్పడబోనని, ఎలాంటి నిర్ణయాలు తీసుకోనని తేల్చి చెప్పారు. తనపై అనవసరంగా దుష్ప్రచారం జరుగుతోందని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని, రాజీనామా చేయబోనని, పార్టీ మారనని, కొత్త పార్టీ పెట్టబోనని స్పష్టం చేశారు.

నిధులు సమకూర్చాలన్న మరో ఎమ్మెల్యే వాదనతో ఏకీభవించిన రాజగోపాల్ రెడ్డి

అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి చేసిన విజ్ఞప్తికి సంబంధించిన ఒక వార్తా కథనాన్ని రాజగోపాల్ రెడ్డి 'ఎక్స్' వేదికగా పంచుకుంటూ ఆయనకు మద్దతు తెలిపారు. యెన్నం చేసిన సూచనను మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నానని పేర్కొన్నారు.

"మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి. సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, స్థానిక సమస్యల పరిష్కారానికి అవసరమైన మేరకు నిధులు కేటాయించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తించి వ్యవహరించాలి" అని ఆయన పేర్కొన్నారు.
Komatireddy Raj Gopal Reddy
Telangana
Telangana Congress
Intelligence surveillance
Yennam Srinivas Reddy

More Telugu News