దస్త్రాల దహనం కేసులో బిగ్ ట్విస్ట్... మదనపల్లె మాజీ ఆర్డీవో మురళి అరెస్ట్

  • నిన్న మురళి బెయిల్ ను రద్దు చేసిన సుప్రీంకోర్టు
  • తిరుపతిలోని నివాసంలో అరెస్ట్ చేసిన పోలీసులు
  • తదుపరి దర్యాప్తును వేగవంతం చేయనున్న సీఐడీ అధికారులు
మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మదనపల్లె పూర్వ ఆర్డీవో మురళిని సీఐడీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ఆయనకు గతంలో మంజూరైన మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు రద్దు చేయడంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, గతేడాది జులై 21న మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కొన్ని కీలక దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు, అప్పటి ఆర్డీవో మురళిని నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో ఆయనకు ఈ ఏడాది జూన్ 2న సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, నిన్న ఈ బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన సీఐడీ పోలీసులు, తిరుపతిలోని ఆయన నివాసంలో ఉన్న మురళిని అదుపులోకి తీసుకున్నారు. మురళి 2022 అక్టోబర్ నుంచి 2024 ఫిబ్రవరి 5 వరకు మదనపల్లె ఆర్డీవోగా బాధ్యతలు నిర్వర్తించారు. బెయిల్ రద్దయిన 24 గంటల్లోపే ఆయన్ను అరెస్టు చేయడం గమనార్హం. ఈ కేసులో తదుపరి దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. 


More Telugu News