వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కీలక తీర్పు

  • చట్టంలోని కీలక ప్రొవిజన్ ను నిలిపివేస్తూ ఆదేశాలు
  • మొత్తంగా చట్టంపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు
  • వక్ఫ్ బోర్డులో ముస్లింలే మెజారిటీ సంఖ్యలో ఉండాలని వ్యాఖ్య
వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025 పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. ఈ చట్టంలోని ముఖ్యమైన ప్రొవిజన్ ను నిలిపివేసింది. అయితే, మొత్తంగా చట్టంపై స్టే విధించాలంటూ పిటిషన్ దారులు చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. వక్ఫ్ చట్టానికి చేసిన సవరణలో భాగంగా ‘కనీసం ఐదేళ్లు ఇస్లాంను అనుసరించిన వ్యక్తి మాత్రమే ఆస్తిని వక్ఫ్‌ చేయడానికి అవకాశం ఉంటుంది’ అనే ప్రొవిజన్ ను కేంద్రం ఈ చట్టంలో చేర్చింది.

ఈ ప్రొవిజన్ పై సుప్రీం కోర్టు తాజాగా స్పందిస్తూ.. ఒక వ్యక్తి ఇస్లాంను అనుసరిస్తున్నట్లు నిర్ణయించేలా నిబంధనలు తయారుచేసే వరకు దీనిని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. కాగా, ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025ను పూర్తిగా నిలిపివేయాలని దాదాపు 100కు పైగా పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన విషయం తెలిసిందే.

వక్ఫ్ సవరణ చట్టంలో కొన్ని సెక్షన్లకు కొంత రక్షణ అవసరమని కోర్టు వ్యాఖ్యానించింది. వక్ఫ్‌ బోర్డులో ముస్లిం సభ్యుల సంఖ్య కచ్చితంగా మెజార్టీలో ఉండాలని పేర్కొంది. బోర్డ్‌ లేదా కౌన్సిల్‌ సీఈవోగా ముస్లిం సభ్యుడే ఉండాలని, మొత్తం సభ్యులలో ముస్లిమేతరుల సంఖ్య ముగ్గురు లేదా నలుగురికి పరిమితం చేయాలని సుప్రీంకోర్టు చెప్పింది.


More Telugu News