బీఆర్ఎస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి... కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

Jeevan reddy joins BRS
  • జగిత్యాల బహిరంగ సభలో కారు ఎక్కిన జీవన్ రెడ్డి
  • ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని విమర్శ
  • ఈరోజు కేసీఆర్ వస్తున్నారనే మేడిగడ్డకు రేవంత్ రెడ్డి వచ్చారని ఆగ్రహం
జగిత్యాల మాజీ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుమారు 40 మంది తన ముఖ్య అనుచరులతో కలిసి ఆయన 'కారు' ఎక్కారు. ఈ సభకు జగిత్యాల నుంచే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు.

బీఆర్ఎస్ పార్టీలో చేరిన అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని విమర్శించారు. ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని, కానీ అసలు గతంలో ఇచ్చిన వాటిని కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ ఈరోజు జగిత్యాలకు వస్తున్నారని తెలిసి, నిన్నటి వరకు నిద్రపోయిన రేవంత్ రెడ్డి ఈరోజు మేడిగడ్డకు వచ్చారని విమర్శించారు.

ఎస్ఎల్‌బీసీ నిర్మాణ దశలో కుంగిపోతే 8 మంది కార్మికుల శవాలను కూడా వెలికి తీయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేడిగడ్డలో రెండు పిల్లర్లు కూలినందుకు ఎంతో రాద్దాంతం చేశారని, మరి దానిని ఎందుకు బాగు చేయలేదని ప్రశ్నించారు. "నేను ఏదో ఆశించి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరలేదు" అని స్పష్టం చేశారు. ఈ రాష్ట్రానికి పట్టిన శని, పీడ విరగడ కావాలని, నాయకత్వ మార్పు కావాలని తాను పార్టీ మారానని చెప్పారు. తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో అన్నీ చూశానని అన్నారు.
Go Back to Shorts
Jeevan reddy joins BRS
KCR welcomes jeevan reddy
jagityal meeting

More Telugu News