Palla Srinivasa Rao: ఇది ప్రజలకు నిజమైన దీపావళి కానుక: జీఎస్టీ మార్పులపై పల్లా శ్రీనివాసరావు

Palla Srinivasa Rao Welcomes GST Reductions as True Diwali Gift
షార్ట్స్‌లో చూడండి
దేశంలోని పేద, మధ్యతరగతి వర్గాలకు భారీ ఉపశమనం కలిగిస్తూ పలు నిత్యావసర వస్తువులు, సేవలపై జీఎస్టీ భారాన్ని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా స్వాగతించింది. ఈ సంస్కరణలు సామాన్య ప్రజల భవిష్యత్తుకు బలమైన భరోసా ఇస్తాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన విశాఖపట్నంలో ఒక ప్రకటన విడుదల చేశారు.

ముఖ్యంగా వైద్యం, విద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించిన వస్తువులపై పన్నులు తగ్గించడం చారిత్రాత్మక నిర్ణయమని ఆయన అభివర్ణించారు. 33 రకాల అత్యవసర ఔషధాలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయడం, ఇతర మందులపై పన్నును 5 శాతానికి పరిమితం చేయడంతో సామాన్య కుటుంబాలకు వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. అదేవిధంగా, విద్యపై జీఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం వల్ల విద్యార్థుల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గి, చదువు మరింత అందుబాటులోకి వస్తుందని అన్నారు.

వ్యవసాయ పరికరాలపై పన్ను తగ్గింపు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తుందని, రైతుల కొనుగోలు శక్తిని పెంచుతుందని పల్లా శ్రీనివాసరావు వివరించారు. వ్యక్తిగత వస్తువులు, వ్యక్తిగత బీమా పథకాలపై జీఎస్టీని రద్దు చేయడం వల్ల వినియోగం పెరిగి దేశీయ మార్కెట్‌కు ఊపు వస్తుందని, కోట్లాది కుటుంబాలకు బీమా భద్రత అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ జీఎస్టీ సంస్కరణలు ప్రజలకు నిజమైన దీపావళి కానుక అని ఆయన వ్యాఖ్యానించారు. పేదలు, రైతుల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఆ దిశగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జీఎస్టీ కౌన్సిల్‌కు టీడీపీ తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
Go Back to Shorts
Palla Srinivasa Rao
GST
Goods and Services Tax
Narendra Modi
Nirmala Sitharaman
Telugu Desam Party
Visakhapatnam
tax reduction
Indian economy
middle class

More Telugu News