ధర్మస్థల కేసులో కీలక పరిణామం... తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరం లభ్యం

  • అధికారికంగా ధృవీకరించిన కర్ణాటక హోంమంత్రి పరమేశ్వర
  • ఫిర్యాదుదారుడు చెప్పిన 13 ప్రాంతాల్లో సిట్ తవ్వకాలు
  • ఆరో స్థానంలో అస్థిపంజరం గుర్తింపు
  • లభ్యమైన అవశేషాలు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు తరలింపు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ధర్మస్థల సామూహిక ఖననాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరుపుతున్న తవ్వకాల్లో పురుషుడి అస్థిపంజరంతో పాటు పలు మానవ ఎముకలు లభ్యమైనట్లు కర్ణాటక హోంశాఖ మంత్రి జి. పరమేశ్వర తొలిసారి అధికారికంగా ధృవీకరించారు. 

గురువారం నాడు బెంగళూరులో విలేకరులతో మాట్లాడిన హోంమంత్రి పరమేశ్వర, ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. "ఒక గుర్తుతెలియని వ్యక్తి తాను 13 ప్రాంతాల్లో మృతదేహాలను పాతిపెట్టినట్లు ఫిర్యాదు చేశాడు. అతని వాంగ్మూలం ఆధారంగా సిట్ బృందాలు ఆ ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టాయి. ఆరో ప్రదేశంలో ఒక పురుషుడి అస్థిపంజరం దొరికింది. దీంతో పాటు మరో కొత్త ప్రదేశంలోనూ కొన్ని ఎముకలు లభ్యమయ్యాయి. లభ్యమైన అన్ని అవశేషాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపాం" అని ఆయన స్పష్టం చేశారు. 13వ స్థానంలో మాత్రం ఇంకా ఏమీ దొరకలేదని ఆయన తెలిపారు.

ఫిర్యాదుదారుడు మెజిస్ట్రేట్ ముందు సెక్షన్ 164 కింద వాంగ్మూలం ఇస్తూ, తాను వందల సంఖ్యలో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు చెప్పడంతో ప్రభుత్వం ఈ కేసును తీవ్రంగా పరిగణించి సిట్ ఏర్పాటు చేసిందని పరమేశ్వర గుర్తుచేశారు. దర్యాప్తులో ప్రభుత్వం ఎలాంటి జోక్యం చేసుకోదని, శాస్త్రీయంగా, సాంకేతిక పరిజ్ఞానంతో నిజానిజాలు నిగ్గు తేల్చాలని సిట్‌కు పూర్తి స్వేచ్ఛనిచ్చామని ఆయన వివరించారు.


More Telugu News