34 సంవత్సరాల తరువాత రెన్షి రాజా గారిని కలవడం సంతోషంగా ఉంది: పవన్ కల్యాణ్
- గతంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న పవన్ కల్యాణ్
- తమిళనాడులో షిహాన్ హుస్సేని వద్ద శిష్యరికం
- కరాటే స్కూల్లో పవన్ కు రెన్షి రాజా సీనియర్
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తమిళనాడుకు చెందిన రెన్షి రాజా గారిని 34 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి కలుసుకోవడం ఆనందం కలిగించిందని తెలిపారు. 1990ల ప్రారంభంలో స్వర్గీయ షిహాన్ హుస్సేని కరాటే స్కూల్లో రెన్షి రాజా తన సీనియర్గా ఉన్నారని గుర్తు చేసుకున్నారు.
తాను గ్రీన్ బెల్ట్ సాధించిన సమయంలో, రెన్షి రాజా బ్లాక్ బెల్ట్ సాధించారని పేర్కొన్నారు. షిహాన్ హుస్సేని ఆశయాలను రెన్షి రాజా ముందుకు తీసుకెళుతూ, తాము శిక్షణ పొందిన పాఠశాలకు ఇప్పుడు నాయకత్వం వహించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ తెలిపారు.
ఈ సమావేశంలో షిహాన్ హుస్సేనితో తమకున్న చిరకాల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, మార్షల్ ఆర్ట్స్ పట్ల తమకున్న ఉమ్మడి అభిరుచి గురించి చర్చించుకోవడం అనేక మధుర జ్ఞాపకాలను తిరిగి తెచ్చిందని పవన్ కల్యాణ్ వివరించారు. తాజాగా రెన్షి రాజాతో కలిసి కరాటే ప్రాక్టీస్ ఫొటోలను కూడా పవన్ పంచుకున్నారు.

