Penguin Securities: మరో స్కామ్.. అధిక వడ్డీ పేరుతో హైదరాబాద్ వాసులకు రూ.150 కోట్ల కుచ్చుటోపీ!

Hyderabad Penguin Securities Scam Investors Lose Crores
షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్‌లో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ కాలంలో పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ ఆశ చూపి, వందల మంది నుంచి సుమారు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ నిర్వాహకుల మోసపూరిత మాటలు నమ్మి వేలమంది తమ కష్టార్జితాన్ని కోల్పోయారు.

మూడేళ్ల క్రితం జీడిమెట్ల కేంద్రంగా పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 20 నెలల్లో రెట్టింపు చేసి ఇస్తామని నమ్మబలికారు. ప్రజలను ఆకర్షించేందుకు, నమ్మకం కలిగించేందుకు ఆరంభంలో కొంతమందికి చెప్పినట్లుగానే డబ్బులు చెల్లించారు. దీంతోపాటు బాండ్లు కూడా జారీ చేయడంతో చాలా మంది ఈ సంస్థను నమ్మారు.

"మొదట్లో అంతా బాగానే నడిచింది. లక్షకు రెండు లక్షలు, పది లక్షలకు ఇరవై లక్షలు చొప్పున కొందరికి తిరిగి ఇచ్చారు. ఇది చూసి జనం మరింతగా ఆకర్షితులయ్యారు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ లక్షలకు లక్షలు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు" అని ఓ బాధితుడు వాపోయాడు. తాను కూడా మొదట లాభం పొంది, రెండోసారి 5 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు ఆ మొత్తం పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ సంస్థను వడైగర్ బాలాజీ చౌదరి, స్వాతి మరికొంతమందితో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మూడేళ్లపాటు సజావుగా కార్యకలాపాలు నిర్వహించి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు పోగు చేసుకున్న తర్వాత, నిర్వాహకులు ఇటీవల కార్యాలయానికి తాళాలు వేసి పరారయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ మోసంపై ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేస్తున్నామని జీడిమెట్ల పోలీసులు తెలిపారు. "తక్కువ సమయంలో అత్యధిక వడ్డీ ఇస్తామని చెప్పే మాయమాటలను నమ్మవద్దు. 5-6 శాతం లాభం రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో నూటికి నూరు శాతం లాభాలు వస్తున్నాయంటే ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. ఎవరో పెట్టారని, వారికి లాభాలు వచ్చాయని గుడ్డిగా పెట్టుబడులు పెడితే మోసపోయే ప్రమాదం ఉంది" అని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

పెంగ్విన్ సెక్యూరిటీస్ సంస్థ బోర్డు తిప్పేసిందన్న విషయం తెలియడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని, మోసం విలువ కూడా మరింత పెరగవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 
Go Back to Shorts
Penguin Securities
Hyderabad scam
financial fraud
high interest rates
investment scheme
fraud case
বালাஜி చౌదరి
Swathi
Jeedimetla police
economic offense

More Telugu News