తెలంగాణలో కొండెక్కిన కోడి.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

Chicken Prices Soar in Telangana Due to Summer Heat
  • వడగాడ్పుల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న పౌల్ట్రీ రంగం
  • పది రోజుల్లోనే కిలోకు రూ.100 వరకు పెరిగిన ధర
  • ప్రస్తుతం స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.350 నుంచి రూ.370
తెలంగాణలో మాంసం ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. గత పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరగడంతో కోడి మాంసం ధరలు అమాంతం ఆకాశాన్నంటాయి. కేవలం పది రోజుల వ్యవధిలోనే కిలో చికెన్‌పై దాదాపు రూ.100 వరకు ధర పెరగడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. వారం క్రితం వరకు రూ.240కి లభించిన స్కిన్‌లెస్ చికెన్, ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రూ.350 నుంచి రూ.370 వరకు పలుకుతోంది. దీంతో కిలో కొనాలనుకునే సామాన్యులు అరకిలోతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

రాష్ట్రంలో 45 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు పౌల్ట్రీ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. తీవ్రమైన వడగాడ్పుల కారణంగా ఫారాల్లోని కోళ్లు ఒత్తిడికి గురవుతూ ఆహారం సరిగ్గా తీసుకోవడం లేదని, వేడిని తట్టుకోలేక పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని పౌల్ట్రీ ఫారాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోళ్ల మరణాల వల్ల మార్కెట్‌కు సరఫరా సగానికి పైగా పడిపోయింది. సాధారణంగా వేసవిలో వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ, ఈసారి డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతో ధరలు అదుపు తప్పాయి.

ఈ ధరల పెరుగుదలకు కేవలం ఎండలే కాకుండా పెరిగిన దాణా ఖర్చులు, రవాణా వ్యయం కూడా అదనపు భారంగా మారాయి. వేసవిలో కోళ్లను సురక్షితంగా తరలించేందుకు ప్రత్యేక శీతలీకరణ ఏర్పాట్లు చేయాల్సి రావడం రిటైల్ వ్యాపారులపై మరింత భారం మోపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత కొనసాగితే చికెన్ ధర కిలో రూ.400 మార్కును తాకినా ఆశ్చర్యపోనవసరం లేదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

చికెన్ ధరలు పెరగడంతో చాలా మంది వినియోగదారులు మటన్, చేపల వంటి ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో మటన్ కిలో రూ.800 నుంచి రూ.1000 మధ్య విక్రయిస్తుండగా, బొచ్చ, రవ్వ వంటి చేపలు కిలో రూ.200, కొర్రమీను వంటివి రూ.300 వరకు అమ్ముతున్నారు.
Go Back to Shorts
Chicken Prices
Telangana
Hyderabad
Chicken Rate Hike
Poultry Farms
Summer Heat
Meat Prices
Mutton
Fish

More Telugu News