Bengaluru Techie: 60 లక్షల జీతం.. అయినా భారత్లో ఉండాలా? వద్దా?: బెంగళూరు టెకీ ఆవేదన

- భారత్లో జీవనంపై బెంగళూరు వాసి అసంతృప్తి
- ట్రాఫిక్, మౌలిక వసతుల కొరత, అధిక పన్నులపై రెడ్డిట్లో పోస్ట్
- పన్నులకు తగ్గ ప్రతిఫలం లేదని, నాణ్యమైన జీవితం కొరవడిందని ఆవేదన
- భవిష్యత్తుపై ఆశ లేదని, దేశం విడిచి వెళ్లాలా అని ప్రశ్న
- విదేశాలకు వెళ్లడమే మంచిదని పలువురు నెటిజన్ల సూచన
బెంగళూరుకు చెందిన ఓ 30 ఏళ్ల యువకుడు సోషల్ మీడియా వేదిక రెడ్డిట్లో చేసిన పోస్ట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. తాను, తన భార్య కలిసి ఏటా దాదాపు రూ. 60 లక్షలు సంపాదిస్తున్నప్పటికీ, భారతదేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ జీవించడం సరైనదేనా అని ఆయన ప్రశ్నించారు. అధిక ఆదాయం ఉన్నా దేశంలో జీవన ప్రమాణాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
"కాగితాలపై మా ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. కానీ ఇక్కడి జీవన నాణ్యత చూస్తే, అసలు భారత్లో ఉండటం అవసరమా అనిపిస్తోంది" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. అధ్వాన్నమైన మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ రద్దీ, వైద్య సంరక్షణలో లోపాలు, పెరుగుతున్న జీవన వ్యయం వంటి సమస్యలను ఆయన ప్రస్తావించారు. తాను నివసించే హొరమావు ప్రాంతంలో 3 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 40 నిమిషాలు పడుతోందని, ఆఫీసుకు చేరేసరికే నీరసించిపోతున్నానని తెలిపారు. రోడ్లు అధ్వాన్నంగా ఉండటం, ఎప్పుడూ ఏదో ఒక నిర్మాణ పనులు జరుగుతూనే ఉండటంపై విసుగు వ్యక్తం చేశారు.
తాము చెల్లిస్తున్న భారీ పన్నులకు తగిన ప్రతిఫలం లభించడం లేదని ఆయన వాపోయారు. "మా ఆదాయంలో 30-40% పన్నులకే పోతోంది. కానీ బదులుగా మాకేం లభిస్తోంది? ఉచిత వైద్యం లేదు, సరైన విద్య లేదు, కనీసం తాగడానికి సురక్షితమైన నీరు కూడా లేదు" అని పేర్కొన్నారు. కెనడా, జర్మనీ వంటి దేశాల్లో అధిక పన్నులు ఉన్నా ఉచిత విద్య, వైద్యం, మెరుగైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటాయని పోల్చారు.
ధూళి, శబ్దం, ఒత్తిడి, రోడ్ రేజ్ వంటి సమస్యలతో ప్రశాంతంగా నడవలేని, స్వచ్ఛమైన గాలి పీల్చలేని పరిస్థితి ఉందని ఆయన అన్నారు. సాయంత్రం 7 తర్వాత తన భార్యను ఒంటరిగా బయటకు పంపడానికి భయంగా ఉందని తెలిపారు. ఖర్చులు పెరుగుతున్నా ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగడం లేదని అన్నారు. "ఈ దేశానికి సేవ చేయాలని, ఇక్కడే ఏదైనా సాధించాలని ఉంది. కానీ ఇక్కడి వ్యవస్థ శ్రామిక వర్గాన్ని పిండి పిప్పి చేస్తోంది. మనం కట్టే పన్నులన్నీ రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయనిపిస్తోంది. అసలు పరిస్థితులు మారతాయనే ఆశ ఉందా? లేక నేను అమాయకంగా ఆలోచిస్తున్నానా?" అని ఆయన ప్రశ్నించారు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవ్వగా, చాలా మంది నెటిజన్లు స్పందించారు. అవకాశం ఉంటే విదేశాలకు వెళ్లి స్థిరపడడమే మంచిదని కొందరు సూచించారు. పరిస్థితులు ఇప్పట్లో మారే అవకాశం లేదని, సౌకర్యాలను వదులుకుని మొదట్లో కష్టపడితే భవిష్యత్ తరాలకైనా మంచి వాతావరణం లభిస్తుందని మరికొందరు వ్యాఖ్యానించారు.