KA Paul: పేరుకు భారత్ సమ్మిట్.. ఒక్క భరతుడు రాలేదు: రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్పై కేఏ పాల్ తీవ్ర విమర్శలు

- రూ.100 కోట్లతో సమ్మిట్, అయినా ప్రముఖులెవరూ హాజరుకాలేదని విమర్శలు
- ఇది కాంగ్రెస్ సమ్మిట్ అని, రాష్ట్రానికి, దేశానికి నష్టమని వ్యాఖ్య
- తన శాంతి సదస్సు ప్రతిపాదనను రేవంత్ కాపీ చేశారని పాల్ ఆరోపణ
- శాంతి, పెట్టుబడులకు తానే పరిష్కారమని పాల్ వ్యాఖ్య
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'భారత్ సమ్మిట్'పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 'పేరుకు భారత్ సమ్మిట్, కానీ ఒక్క భరతుడు రాలేదు' అంటూ సదస్సు నిర్వహణ తీరుపై ఆయన పలు ఆరోపణలు చేశారు.
ఈ సమ్మిట్ కోసం ప్రభుత్వం వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని తెలిసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని పేర్కొన్నారు. దాదాపు 200 దేశాల నుంచి అధ్యక్షులు, ప్రధానమంత్రులను ఈ సదస్సుకు ఆహ్వానించారని, అయితే వారిలో ఒక్కరు కూడా హాజరు కాలేదని ఆయన విమర్శించారు. అంతేకాకుండా, ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రిటీలు గానీ, వేల సంఖ్యలో ఉన్న బిలియనీర్లు గానీ ఎవరూ ఈ సదస్సు వైపు కన్నెత్తి చూడలేదని పాల్ వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమానికి 'భారత్ సమ్మిట్' అని పేరు పెట్టడంపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పేరులో 'భారత్' ఉన్నా, ఒక్క 'భరతుడు' కూడా సదస్సుకు రాలేదని ఎద్దేవా చేశారు. ఇది 'భారత్ సమ్మిట్' కాదని, కేవలం 'కాంగ్రెస్ సమ్మిట్' అని విమర్శించారు. ఇలాంటి సమ్మిట్లతో తెలంగాణ రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో తాను 'గ్లోబల్ పీస్ సమ్మిట్' నిర్వహిస్తానని ప్రతిపాదించగా, దానికి రేవంత్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారని గుర్తుచేశారు. అందరినీ ఆహ్వానిద్దామని చెప్పిన రేవంత్, ఇప్పుడు ఎవరినీ తీసుకురాలేకపోయారని అన్నారు. తన ఆలోచనను కాపీ కొట్టి, 'పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు' రేవంత్ రెడ్డి వ్యవహరించారని పాల్ మండిపడ్డారు. ప్రస్తుతం జరుగుతున్న సదస్సుకు కొలంబియా దేశానికి చెందిన ఒక మాజీ మంత్రి మాత్రమే వచ్చారని ఆయన తెలిపారు. రాష్ట్రానికి శాంతి కావాలన్నా, పెట్టుబడులు రావాలన్నా 'పాల్ అన్న' రావాలని, తద్వారా పాలన మారాలని వ్యాఖ్యానించారు.