Rahul Gandhi: హైదరాబాద్లో భారత్ సమ్మిట్లో పాల్గొన్న రాహుల్ గాంధీ... స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

- హెచ్ఐసీసీలో భారత్ సమ్మిట్
- విమానాశ్రయంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
- అన్ని వర్గాల ఆకాంక్షలు నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమన్న రేవంత్ రెడ్డి
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో జరుగుతోన్న భారత్ సమ్మిట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయనకు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాహుల్ గాంధీ హెచ్ఐసీసీకి బయలుదేరారు.
అన్ని వర్గాల ఆకాంక్షలు నేరవేర్చడమే లక్ష్యం
సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ సమ్మిట్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో పథకాలను తీసుకువచ్చామని అన్నారు. దేశంలోనే అతిపెద్ద రైతు రుణమాఫీ చేశామని తెలిపారు. ఇప్పటివరకు రూ. 20 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు చెప్పారు.
రైతు భరోసా కింద రూ. 12 వేలు ఇస్తున్నామని, వరికి మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తున్నామని అన్నారు. నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకువచ్చామని అన్నారు. ప్రజలకు ఏ సమయంలో ఏం కావాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా తెలుసని అన్నారు.