Santosh Jagdale: కళ్లముందే నాన్నను కాల్చారు: యువతి ఆవేదన

Father Shot Dead in Jammu and Kashmir Terrorist Attack

  • జమ్మూకశ్మీర్‌ పహల్గామ్ లో టూరిస్టులపై ఉగ్రదాడి
  • పూణే వ్యాపారి సంతోష్ జగ్‌దాలే, ఆయన బంధువు హత్య
  • మతం అడిగి, కల్మా చదవమని బలవంతం చేసిన ఉగ్రవాదులు
  • నిరాకరించడంతో కాల్చి చంపిన వైనం

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి అత్యంత భయానకంగా సాగింది. తుపాకీ కాల్పుల శబ్దాలు, ఆర్తనాదాల మధ్య పూణేకు చెందిన వ్యాపారవేత్త సంతోష్ జగ్‌దాలే కుటుంబం ఒక టెంట్‌లో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాక్కుంది. ఆ భయానక క్షణాలను ఆయన కుమార్తె ఆశావరి వివరిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. స్థానిక పోలీసుల వంటి దుస్తులు ధరించిన కొందరు వ్యక్తులు కొండపై నుంచి దిగివచ్చి కాల్పులు జరపడం మొదలుపెట్టారని ఆమె తెలిపారు.

వెంటనే తాను, తన తల్లి ప్రగతి, తండ్రి సంతోష్ ఇతర పర్యాటకులతో కలిసి సమీపంలోని టెంట్‌లోకి పరుగులు తీశామని ఆశావరి చెప్పారు. బయట ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతున్నాయని తాము భావించామన్నారు. కానీ, ఉగ్రవాదులు తామున్న టెంట్ సమీపానికి వచ్చి పక్క టెంట్‌పై కాల్పులు జరపడంతో భయంతో వణికిపోయామన్నారు. అంతలో, "చౌదరి, బయటకు రా" అంటూ గట్టిగా అరవడంతో తమ గుండె ఆగినంత పనైందని ఆమె వాపోయారు.

ఆ తర్వాత ఉగ్రవాదులు తన తండ్రిని టెంట్ నుంచి బయటకు లాగారని, ప్రధాని మోదీకి మద్దతు ఇస్తున్నందుకే ఈ దాడి చేస్తున్నామని అన్నారని ఆశావరి తెలిపారు. అక్కడ చాలా మంది పర్యాటకులు ఉన్నప్పటికీ, హిందువులా, ముస్లింలా అని అడిగి మరీ మగవారిని లక్ష్యంగా చేసుకున్నారని ఆమె పేర్కొన్నారు. "ఇస్లామిక్ ప్రార్థన (కల్మా) చదవాలని మా నాన్నను అడిగారు. ఆయన చదవలేకపోవడంతో తలపై ఒకటి, చెవి వెనుక ఒకటి, వీపులో ఒకటి.. మొత్తం మూడు బుల్లెట్లు కాల్చారు" అని ఆశావరి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తన మామయ్య వైపు తిరిగి ఆయనను కూడా కాల్చి చంపారని వివరించారు. దాడి జరిగిన 20 నిమిషాల తర్వాత పోలీసులు, భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయని ఆమె తెలిపారు.

ఈ దాడిలో సంతోష్ జగ్‌దాలేతో పాటు మహారాష్ట్రకు చెందిన మరో ఐదుగురు సహా మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. 'మినీ స్విట్జర్లాండ్'గా పిలిచే బైసరన్ వ్యాలీలో పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదిస్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. గాయపడిన వారిని హెలికాప్టర్లు, స్థానికుల సహాయంతో ఆసుపత్రులకు తరలించారు. 2019 పుల్వామా దాడి తర్వాత జమ్మూకశ్మీర్‌లో ఇదే అతిపెద్ద ఉగ్రదాడి కావడం గమనార్హం.

Santosh Jagdale
Jammu and Kashmir Terrorist Attack
Pahalgham Attack
Terrorism in India
Resistance Front
Lashkar-e-Taiba
India Terror Attack
Kashmir Valley Attack
Ashavari Jagdale
Pulwama Attack
  • Loading...

More Telugu News