Bandi Sanjay: మోదీ, అమిత్ షా, కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతల ఘాటు వ్యాఖ్యలు... స్పందించిన బండి సంజయ్

- కాంగ్రెస్ నేతల భాష దారుణంగా ఉందని బండి సంజయ్ మండిపాటు
- రాహుల్ గాంధీ రాసిచ్చిన స్క్రిప్ట్ను చదివారని ఆరోపణ
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలపై కాంగ్రెస్ నేతలు ఉపయోగించిన భాష అత్యంత దారుణమని, అది కేవలం అవమానకరంగానే కాకుండా ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యలు వారి వ్యక్తిగత అభిప్రాయాలు కావని, రాహుల్ గాంధీ స్వయంగా రాసిచ్చిన స్క్రిప్ట్ను వారు చదివారని ఆరోపించారు.
తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నేతలు రాజకీయ దివాలాకోరుతనంతో అవమానకరంగా మాట్లాడారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుల ప్రవర్తనను తెలంగాణ సమాజం నిశితంగా గమనిస్తోందని అన్నారు. చేసిన వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దేశమంతా ఛీత్కరించుకుంటుందన్న నిరాశ కావొచ్చు లేదా దేశాన్ని ఇంకా దోపిడీ చేయలేకపోతున్నామనే పేరాశ కావొచ్చు, కానీ వ్యక్తిత్వం, వివేకం మరిచి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం దారుణమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. వారి భాష తీరును చూస్తుంటే 2029లో కాదు, మరో యుగం గడిచినా ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ఆయన విమర్శించారు.