Indian Migrants: భారత అక్రమ వలసదారుల తరలింపుపై అమెరికా స్పందన

అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత వలసదారులను ఆ దేశం వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. మన దేశానికి చెందిన 104 మంది అక్రమ వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన యూఎస్ ఎయిర్ ఫోర్స్ విమానం సీ-17 నిన్న మధ్యాహ్నం అమృత్ సర్ కు చేరుకుంది. మరోవైపు వలసదారులకు క్రిమినల్స్ మాదిరి సంకెళ్లు వేసి తరలించారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. ఈ అంశం ఈరోజు పార్లమెంట్ సమావేశాలను కూడా కుదిపేసింది. 

ఈ నేపథ్యంలో ఈ అంశంపై అమెరికా స్పందించింది. ఢిల్లీలోని యూఎస్ దౌత్య కార్యాలయ ప్రతినిధి మాట్లాడుతూ... తమ దేశం, ప్రజల భద్రత కోసం ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేయడం అత్యవసరమని చెప్పారు. అది తమ దేశ విధానమని అన్నారు. విమానంలో వలసదారుల ప్రయాణం గురించి ఇంతకు మించి ఏమీ మాట్లాడలేమని చెప్పారు. 

మరోవైపు, ఈ అంశంపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ పార్లమెంట్ లో ప్రకటన చేశారు. అమెరికాలో ఏళ్ల నుంచి అక్రమ వలసదారుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. అన్ని దేశాల అక్రమ వలసదారులను అమెరికా డిపోర్ట్ చేస్తోందని అన్నారు. 2012లో ఈ సంఖ్య 530గా ఉందని... ఇప్పుడు 2 వేలకు పైగా ఉందని చెప్పారు. 
Indian Migrants
USA
Deportation

More Telugu News