KTR: రేవంత్ రెడ్డి సొంత గ్రామం మాజీ సర్పంచ్ అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు: కేటీఆర్

KTR reveals why Sai Reddy commits suicide
షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోదరుల అరాచకాలు తట్టుకోలేకనే సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదని, ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అన్నారు. సూసైడ్ నోట్ ఆధారంగా అనుముల సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు.

ఆయన ఆత్మహత్య బాధాకరమన్నారు. ఆరు నెలల క్రితం ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారనే కక్షతో 40 ఏళ్ల క్రితం కట్టుకున్న ఇంటి ముందు... పశువుల ఆసుపత్రి కట్టడమే కాకుండా సీఎం ఆదేశాలతో ఇంటికి దారి లేకుండా అడ్డుగా గోడ కట్టేందుకు పూనుకున్నారని ఆరోపించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ఆవేదన వెలిబుచ్చారు. 

కొండారెడ్డిపల్లికి రెండుసార్లు సర్పంచ్‌గా చేసి.. ఎన్నో సేవలు అందించిన వ్యక్తిని గౌరవించాల్సింది పోయి, 85 ఏళ్ల వయస్సున్న పెద్దాయన అని కూడా చూడకుండా వేధించారని ధ్వజమెత్తారు. వారి వేధింపులు తట్టుకోలేక ఆయన పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారన్నారు. సీఎం బ్రదర్స్ తనపై కక్ష కట్టడం వల్లే చనిపోతున్నానని మరణ వాంగ్మూలంలో స్పష్టంగా పేర్కొన్నారని వెల్లడించారు.

ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు. కొడంగల్‌లో గిరిజన ఆడబిడ్డలపై దమనకాండ దేశం మరవకముందే, సీఎం సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ ఆత్మహత్య చూస్తుంటే... సీఎం, ఆయన సోదరుల అరాచకాలకు అంతేలేకుండా పోయిందని తెలిసిపోతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని... అరాచక, నియంతృత్వ, దుర్మార్గపు పాలన అని మండిపడ్డారు.
Go Back to Shorts
KTR
Telangana
Revanth Reddy

More Telugu News