హిమాచల్ ప్రదేశ్ సీఎంకు సమోసాలు ఆర్డర్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే

BJP MLA orders 11 samosas online for CM Sukhu
  • సమస్యలు పక్కన పెట్టి సమోసాల విషయంలో సీఐడీ విచారణకు ఆదేశించారని విమర్శ
  • దీనిని నిరసిస్తూ సీఎంకు 11 సమోసాలు పంపించినట్లు వెల్లడి
  • ప్రజా సమస్యలను గుర్తు చేసేందుకే ఇలా చేశానని ఎమ్మెల్యే ఆశిష్ శర్మ
హిమాచల్ ప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే ఆశిష్ శర్మ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖుకు సమోసాలు ఆర్డర్ చేశారు! సీఎంకు సమోసాలు ఆర్డర్ చేసినట్లు స్వయంగా ఎమ్మెల్యేనే ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఓ వైపు రాష్ట్రంలో నిరుద్యోగం, ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలు పెరుగుతుంటే... సమోసాల అంశంలో సీఐడీ విచారణకు ఆదేశించడం విడ్డూరమన్నారు. ఇది తమను తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు.

ఈ తీరును నిరసిస్తూ తాను సీఎంకు 11 సమోసాలు పంపించానన్నారు. ఆయనకు ప్రజా సమస్యలను గుర్తు చేసేందుకు మాత్రమే తాను ఇలా చేశానని స్పష్టం చేశారు. మరో బీజేపీ సీనియర్ నేత, హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాకూర్... బీజేపీ కార్యకర్తలకు సమోసా పార్టీ ఇచ్చి ఈ వివాదంపై వ్యంగ్యంగా స్పందించారు.

అక్టోబర్ 21న సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమం కోసం అధికారులు ప్రముఖ హోటల్ నుంచి సమోసాలు తెప్పించారు. అయితే వాటిని సెక్యూరిటీ స్టాఫ్ ఆరగించినట్లు వార్తలు వచ్చాయి. సీఎంకు చేరాల్సిన సమోసాలు ఎలా మిస్ అయ్యాయో గుర్తించేందుకు సీఐడీ విచారణకు ఆదేశించినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ప్రతిపక్ష బీజేపీ నుంచి విమర్శలు వచ్చాయి.
Advertisement
Himachal Pradesh
Samosa
BJP
Congress

More Telugu News