ప్రతి ఒక్కరూ తిరుమల నిబంధనలను పాటించాల్సిందే: చంద్రబాబు
- తిరుమల కోట్ల మంది హిందువుల పుణ్యక్షేత్రమన్న చంద్రబాబు
- భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తుందని వ్యాఖ్య
- ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విన్నపం
కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయం కోట్ల మంది హిందువుల అతిపెద్ద పుణ్యక్షేత్రమని సీఎం చెప్పారు. ఈ దివ్యక్షేత్రం మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టమని అన్నారు. ఏడుకొండలవాడి పవిత్రతను కాపాడేందుకు, భక్తుల మనోభావాలను పరిరక్షించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. తిరుమల దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు అత్యంత నియమనిష్ఠలతో, శ్రద్ధాసక్తులతో స్వామివారిని కొలుస్తారని అన్నారు.
భక్తులు అత్యంత పవిత్రంగా భావించే ఈ క్షేత్ర పవిత్రతను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పైనా ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. శ్రీవారి సన్నిధికి వెళ్లే ప్రతి ఒక్కరూ ఆలయ నియమాలను, ఆగమశాస్త్ర ఆచారాలను, టీటీడీ నిబంధనలను తప్పక పాటించాలని కోరుతున్నానని అన్నారు. భక్తుల మనోభావాలకు, ఆలయ ఆచారాలకు భిన్నంగా ఎవరూ వ్యవహరించవద్దని విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. 'ఓం నమో! శ్రీ వెంకటేశాయ నమః' అని ట్వీట్ చేశారు.
మరోవైపు, జగన్ తన తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు. కాసేపట్లో ఆయన మీడియా ముందుకు రానున్నారు.