మొదటిసారి వచ్చాను కాబట్టి సున్నితంగా చెబుతున్నాను: బండి సంజయ్ హెచ్చరిక

Bandi Sanjay warning to Ekalavya school staff
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌ను సందర్శించిన సంజయ్
  • భోజనం, టాయిలెట్లపై ఫిర్యాదు చేసిన విద్యార్థులు
  • మన పిల్లలకు ఇలాంటి భోజనమే పెడతామా? అని బండి సంజయ్ నిలదీత
టాయిలెట్‌లో నీళ్లు లేకపోతే పట్టించుకోరా? మొదటిసారి వచ్చాను కాబట్టి సున్నితంగా చెబుతున్నాను... మరోసారి కూడా ఇలాగే చేస్తే మామూలుగా చెప్పబోనని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. ఆయన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌ను సందర్శించారు. తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. విద్యార్థులను వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్నంలో రాళ్లు వస్తున్నాయని, టాయిలెట్లు సరిగ్గా లేవని, నీళ్లు కూడా రావడం లేదని విద్యార్థులు ఫిర్యాదు చేశారు.

అధికారులు, ఉపాధ్యాయులతో బండి సంజయ్ సమావేశం నిర్వహించారు. అన్నంలో రాళ్లు వస్తున్నాయని విద్యార్థులు చెబుతున్నారని, మన పిల్లలకు ఇలాంటి ఆహారం పెడతామా? అని నిలదీశారు. టాయిలెట్‌లు సరిగ్గా లేకుంటే పట్టించుకోకపోతే ఎలా? అని మండిపడ్డారు. తాను రెండోసారి వచ్చినప్పుడు కూడా ఇలాగే ఉంటే సున్నితంగా చెప్పేది ఉండదని స్పష్టం చేశారు.

టాయిలెట్ల నిర్మాణానికి శంకుస్థాపన

ప్రధాని మోదీ ఆదేశాల మేరకు ప్రతి ఎంపీ తన పరిధిలోని ఏకలవ్య పాఠశాలను సందర్శించి సమస్యలు తెలుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా తానూ ఇక్కడకు వచ్చానన్నారు. 

దేశవ్యాప్తంగా 728 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయని, ఇప్పటి వరకు 410 పాఠశాలల్లో విద్యాబోధన కొనసాగుతోందన్నారు. దేశవ్యాప్తంగా ఏకలవ్య పాఠశాలల్లో 1.20 లక్షల మంది చదువుకుంటున్నట్లు చెప్పారు. తెలంగాణలోని 23 ఏకలవ్య పాఠశాలల్లో 8,300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని తెలిపారు.
Advertisement
Bandi Sanjay
BJP
Telangana
School

More Telugu News