ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోంది: పురందేశ్వరి

Purandeswari slams YCP
  • పురందేశ్వరి నివాసంలో బీజేపీ నేతల కీలక సమావేశం
  • వైసీపీ అరాచక పాలన వల్లే ప్రజలు కూటమికి ఓట్లు వేశారన్న పురందేశ్వరి
  • ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ యత్నిస్తోందన్న సత్యకుమార్
ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి నివాసంలో నేడు బీజేపీ నేతల కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో బీజేపీని ఎలా బలోపేతం చేయాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించారు. 

ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ, ఇటీవలి ఎన్నికల్లో ఓటమిని వైసీపీ ఇంకా జీర్ణించుకోలేకపోతోందని అన్నారు. వైసీపీ అరాచక పాలన వల్లే కూటమికి ఓట్లు వేశారని తెలిపారు. ఇక, అధినాయకత్వం పిలుపు ఇచ్చిన మేరకు బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కూటమి పార్టీలు సమన్వయంతో ముందుకెళ్లేలా ముఖ్యమంత్రితో చర్చించామని పురందేశ్వరి వెల్లడించారు. 

ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ మంత్రి సత్యకుమార్ స్పందిస్తూ... వైసీపీ అరాచకాలను ప్రజలు తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అందుకే ఈవీఎం ట్యాంపరింగ్ అంటున్నారని, ఈవీఎం ట్యాంపరింగ్ కు అవకాశమే లేదని సత్యకుమార్ స్పష్టం చేశారు.
Advertisement
Daggubati Purandeswari
BJP
YSRCP
TDP-JanaSena-BJP Alliance

More Telugu News