భూములు దోచుకున్నారని ఊరికే అనడం కాదు... ఆధారాలు చూపించండి: పేర్ని నాని
- సహజ వనరుల దోపిడీపై నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు
- వైసీపీ నేతలు భూములు దోచుకున్నారని ఆరోపణ
- ఏ దళితుడి భూమి దోచుకున్నామో చెప్పాలన్న పేర్ని నాని
నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సహజ వనరుల దోపిడీ అంశంపై శ్వేతపత్రం విడుదల చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శనాస్త్రాలు సంధించారు.
ఎంతో అనుభవం ఉందని మీరు చెప్పుకుంటున్నారు కదా... ఊరికే భూములు దోచుకున్నారని అనడం కాదు... మీలో ఖలేజా ఉంటే... ఆధారాలను ఈ సమాజం ముందు పెట్టండి అని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వ హయాంలో ఏ దళితుల భూమిని ఏ ఎమ్మెల్యే, ఏ మంత్రి బదలాయించుకున్నాడో చెప్పాలి కదా అని నిలదీశారు.
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, రెవెన్యూ శాఖ మీవే కదా... అధికారంలో ఉన్నది మీరే కదా... ఎందుకు నిరూపించలేకపోతున్నారు? అంటూ పేర్ని నాని మండిపడ్డారు.
అధికారం కోసం ఐదు పదుల వయసున్న కుర్రాడితో పోటీ పడి, ఆ కుర్రాడ్ని నాశనం చేయడం కోసం విషం చిమ్మే దిక్కుమాలిన మార్గం ఎంచుకున్నారు అంటూ విమర్శించారు. అలవికాని హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయలేక ఈ 35 రోజుల్లో దిక్కులు చూడడం తప్ప మీరు చేస్తున్నదేంటి? అని పేర్ని నాని ప్రశ్నించారు.