దాయాదుల పోరా మజాకా.. న్యూయార్క్లో ఆకాశన్నంటిన హోటల్ ధరలు!
- జూన్ 9న న్యూయార్క్ వేదికగా భారత్, పాక్ పోరు
- న్యూయార్క్లో 600 శాతం పెరిగిన హోటళ్ల ధరలు
- ప్రస్తుతం అక్కడి కొన్ని హోటళ్లలో రూమ్ ధర రూ. 9,422
- అదే మ్యాచ్ ఉన్న రోజు ఈ ధర రూ. 66,624 పలుకుతున్న వైనం
ఎలాగైనా ప్రత్యక్షంగా మ్యాచ్ చూడాలనుకునే అభిమానులు చాలా మంది ఉంటారు. దానికోసం ఎంతటి వ్యయానికైనా వెనకడుగు వేయరు. ఇక గతేడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్కప్లో భాగంగా అహ్మదాబాద్లో జరిగిన పాక్, టీమిండియా మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎలా పోటీ పడ్డారో తెలిసిందే. మ్యాచ్ టికెట్లు దొరికిన వారు బస కోసం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎందుకంటే హోటళ్లు అన్ని హౌస్ఫుల్ బోర్డులు పెట్టేశాయి. ఇక వాటి ధరలు కూడా ఆకశాన్నంటాయి.
ఇప్పుడు అచ్చం ఇలాంటి పరిస్థితినే న్యూయార్క్లో నెలకొంది. అక్కడి హోటళ్ల ధరలకు రెక్కలొచ్చేశాయి. కొన్ని హోటళ్ల రేట్లు ఏకంగా 600 శాతం పెరిగిపోయాయి. ప్రస్తుతం న్యూయార్క్లోని కొన్ని హోటళ్లలో రూమ్స్ ధర రూ. 9,422గా ఉంటే.. మ్యాచ్ ఉన్న రోజు ఈ ధర రూ. 66,624గా ఉండడం గమనార్హం. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు భారత్, పాక్ మ్యాచ్ క్రేజ్ ఏంటి అనేది.
ఇదిలాఉంటే.. 2022లో జరిగిన టీ20 ప్రపంచకప్లో మెల్బోర్న్ వేదికగా జరిగిన దాయాదుల పోరులో టీమిండియానే పైచేయి సాధించిన విషయం తెలిసిందే. పాక్ను భారత్ ఆరు వికెట్ల తేడాతో మట్టికరిపించింది.