జీఐ ట్యాగ్‌తో కుప్పడం పట్టుకు కొత్త కళ... సీఎం చంద్రబాబు వద్ద నేతన్నల హర్షం

New glory for Kuppadam Pattu with GI Tag weavers express joy to CM Chandrababu
  • చీరాల నియోజకవర్గంలో 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • జీఐ ట్యాగ్‌తో కుప్పడం చీరల అమ్మకాలు 30 శాతం పెరిగాయని తెలిపిన కార్మికులు
  • ఉచిత విద్యుత్, రూ.25 వేల ఆర్థిక సాయంపై చేనేతల హర్షం
  • ప్రభుత్వ సాయం బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు సీఎంకు చూపిన నేతన్నలు
  • చేనేత మగ్గం యూనిట్‌ను సందర్శించి కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించడంతో చీరాల కుప్పడం పట్టు చీరలకు విశిష్టమైన గుర్తింపు వచ్చిందని, దీనివల్ల అమ్మకాలు ఏకంగా 30 శాతం పెరిగాయని చేనేత కుటుంబాలు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం అందిస్తున్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రూ.25 వేల ఆర్థిక సాయం తమకు కొండంత అండగా నిలుస్తోందని వారు తెలిపారు. 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చీరాల నియోజకవర్గం కొత్తపేటలో ముఖ్యమంత్రి చంద్రబాబు 'నేతన్న సేవలో' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా కొత్తపేట గ్రామంలోని ఓ చేనేత మగ్గం యూనిట్‌ను సీఎం సందర్శించారు. యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యం ఆయనకు సాదర స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి అక్కడి చేనేత కార్మికులతో నేరుగా మాట్లాడారు. కుప్పడం పట్టు చీరల తయారీలో ప్రత్యేకతలు, సంప్రదాయ నైపుణ్యం, ఉత్పత్తి వ్యయం, మార్కెట్ పరిస్థితులు, ఆదాయం వంటి అంశాలపై వారితో వివరంగా చర్చించారు. 'వన్ డిస్ట్రిక్ట్–వన్ ప్రొడక్ట్' పథకం ద్వారా తమ ఉత్పత్తులకు మంచి ప్రచారం లభిస్తోందని, గత ఏడాది కుప్పడం పట్టుకు కేంద్ర ప్రభుత్వ అవార్డు రావడం గర్వకారణమని చేనేతలు ముఖ్యమంత్రికి వివరించారు.

ప్రభుత్వ సహకారంతో జీవనోపాధికి భరోసా
యూనిట్‌లోని చేనేత కార్మికులతో సీఎం ముఖాముఖిగా మాట్లాడారు. తొలుత కంచి బోర్డర్ చీరల తయారీదారు బత్తా ధనుంజయరావుతో సంభాషించారు. ఆయన కుటుంబ పరిస్థితులు, వృత్తిలో ఎదురవుతున్న సవాళ్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ సాయం తమకు ఎంతో ఊరటనిస్తోందని, ముఖ్యంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వల్ల ఉత్పత్తి ఖర్చు తగ్గిందని కార్మికులు వివరించారు. రూ.25 వేల ఆర్థిక సాయం తమకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తోందని తెలిపారు.

అనంతరం ముఖ్యమంత్రి, యూనిట్ యజమాని బండారు బాలసుబ్రహ్మణ్యంతో కలిసి వర్క్‌షాప్‌లోని మొదటి అంతస్తును పరిశీలించారు. భవనాన్ని మరింత విస్తరించి, మరిన్ని మగ్గాలు ఏర్పాటు చేసి ఎక్కువ మందికి ఉపాధి కల్పించాలన్న తన ప్రణాళికను బాలసుబ్రహ్మణ్యం సీఎంకు వివరించారు. కోవిడ్ కారణంగా నిలిచిపోయిన విస్తరణ పనులను త్వరలోనే తిరిగి ప్రారంభిస్తానని తెలిపారు. ఈ క్రమంలో, మగ్గంపై చీర నేస్తున్న బొడ్డు అరుణ అనే మహిళా కార్మికురాలి పనితీరును సీఎం ఆసక్తిగా తిలకించారు.

ఈ సందర్భంగా పలువురు చేనేత కార్మికులు తమ మొబైల్ ఫోన్లను ముఖ్యమంత్రికి చూపిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందించిన రూ.25 వేల ఆర్థిక సాయం తమ బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు ఫోన్ కు వచ్చిన ఎస్సెమ్మెస్ లను వారు సీఎంకు చూపించారు. ప్రభుత్వ సహకారంతో తమ జీవనోపాధికి పూర్తి భరోసా లభించిందని, భవిష్యత్తుపై నమ్మకం కలిగిందని చేనేత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశాయి.
Advertisement
Chandrababu Naidu
Kuppadam Pattu Sarees
GI Tag Chirala Handloom
Nethanna Sevalo Scheme
National Handloom Day Andhra Pradesh
Andhra Pradesh Weavers Welfare

More Telugu News