Nara Lokesh: మా వద్ద ఉన్న అద్భుత దీపం పేరు... సీబీఎన్: నారా లోకేశ్

  • నెల్లూరులో యువగళం సదస్సు
  • హాజరైన నారా లోకేశ్
  • వైసీపీని భూస్థాపితం చేసేందుకే పొత్తు పెట్టుకున్నామని వెల్లడి
  • జగన్ కు తెలిసింది దోచుకోవడం, దాచుకోవడం మాత్రమేనని విమర్శలు
  • విజనరీ, ప్రిజనరీకి మధ్య తేడాను రాష్ట్ర ప్రజలు గుర్తించాలని పిలుపు
Nara Lokesh describes CBN a wonder lamp

ఓట్ల చీలికతో ఏపీ నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని, అందుకే పొత్తు పెట్టుకున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టినపుడు పవనన్న రాజమండ్రి వచ్చి కలిసి పోరాడదామని చెప్పారు.... అభివృద్ధిని గాడిలో పెట్టడమే మా లక్ష్యం. సైకో సీఎంను తరిమికొట్టి, వైసీపీని భూస్థాపితం చేసేందుకే పొత్తు పెట్టుకున్నామని పేర్కొన్నారు. 

నెల్లూరు వీఆర్సీ మైదానంలో నిర్వహించిన యువగళం సభలో లోకేశ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాట్ నెట్ సోషల్ మీడియా ఫౌండర్, ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఫ్రెడ్రిక్ దేవరంపాటి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. లోకేశ్ మాట్లాడుతూ అనేక అంశాలపై స్పందించారు.

జగన్ కు తెలిసింది ఇదే!

జగన్ కు తెలిసింది దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే. తండ్రి అధికారంలో ఉన్నపుడు భారతి సిమెంట్ అలాగే స్థాపించారు. సీఎం అయ్యాక మద్యం, ఇసుక గ్రావెల్ ద్వారా యధేచ్ఛగా దోచుకున్నారు. ఆయనకు స్టార్టప్ అంటే అర్థం తెలియదు. ఆయనకు ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అంటే తెలియదు. 

ప్రిజనరీ, విజనరీ మధ్య తేడా ను రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి. చంద్రబాబు విజనరీ. ఏపీ విభజన ఎలా జరిగిందో మీకు తెలుసు. 2014లో కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితుల్లో సచివాలయం, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉండగా, చంద్రబాబు అమరావతి రాజధాని బిల్లు పెట్టారు. ఆ తర్వాత కియా, అపోలో, షామీ ఫోన్లు, టీసీఎల్, మెట్రో బోగీలు తయారుచేసే పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. 5 ఏళ్లలో 40 వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని అసెంబ్లీలో గౌతం రెడ్డి స్వయంగా చెప్పారు. 

జగన్మోహన్ రెడ్డి ఓ ప్రిజనరీ... అన్నింటా విధ్వంసమే

జగన్మోహన్ రెడ్డి ఓ ప్రిజనరీ. ఆయన హయాంలో గంజాయి, బూమ్ బూమ్, త్రీ క్యాపిటల్, 9 హార్స్, కోడికత్తి, స్పెషల్ గులకరాయి మేడిన్ ఆంధ్రగా మార్చారు. సోలార్ ఎనర్జీ పీపీఏలు రద్దు చేశారు. అమర్ రాజాను పక్క రాష్ట్రానికి పంపేశారు. లులూను విశాఖకు తెస్తే తెలంగాణాకు పంపారు. రిలయన్స్, హెచ్ఎస్ బీసీ పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. రాజకీయ లబ్ధికోసం వృద్ధులకు పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. వాలంటీర్లను రాజకీయాలకు వాడటంతో పక్కనబెట్టారు. ప్రభుత్వ సిబ్బందితో ఇవ్వాలని మేం చెప్పాం. వారు నియమించిన సీఎస్ ఉండటం వల్లే సకాలంలో రాలేదు. 

నెలలో ప్రజాప్రభుత్వం వచ్చాక వాలంటీర్లతో ఇళ్ల వద్దకే పెన్షన్ ఇస్తాం. జగన్ ప్రభుత్వం విద్యార్థులకు పీజీ ఫీజు రీఎంబర్స్ మెంట్, విదేశీ విద్య రద్దుచేసింది, మేం రాగానే అవి రెండు మళ్లీ పునరుద్దరిస్తాం. మెడికల్ కాలేజిలో మెడికల్ సీట్లు అమ్మకానికి పెట్టింది. మేం వచ్చాక  వైద్య కళాశాలల్లో ఫ్రీ సీట్లు పెంచుతాం.
 
వాలంటీర్ ఉద్యోగం కావాలా? ఐటీ ఉద్యోగం కావాలా?


రాష్ట్రంలో యువత ఆలోచించాలి. 5 వేలు ఇచ్చే వాలంటీర్ కావాలా? రూ.50 వేలు వచ్చే ఐటీ ఉద్యోగం కావాలా? అనంతపురంలో పాదయాత్ర చేసేటపుడు ఒక చెల్లి కలిసింది. కియాలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.30 వేలు సంపాదిస్తున్నానని చెప్పింది. గతంలో హౌస్ వైఫ్ ని, ఇప్పుడు ఇల్లు నేనే నడుపుతున్నానని చెప్పింది. ఆమె ఏటా రూ.3.5 లక్షల జీతం అందుకుంటోంది. 

నేను స్టాన్ ఫోర్డ్ వర్సిటీలో క్రమశిక్షణ నేర్చుకున్నా. అక్కడ ఎగ్జామ్స్ కు ఇన్విజిలేటర్లు ఉండరు. తప్పు చేయకూడదు. 80 మందిలో ఒక్కరు కూడా ఎగ్జామ్స్ సమయంలో అటూఇటూ చూసేవారు కాదు. జీవితంలో పట్టుదల, క్రమశిక్షణ అవసరం, అప్పుడే అనుకున్నది సాధిస్తాం. 

చట్టాలను అధికారపార్టీకి చుట్టంగా మార్చారు

2019కి ముందు నాపై ఒక్క కేసు లేదు. ఏనాడు పోలీసు స్టేషన్ కు వెళ్లలేదు. ప్రపంచబ్యాంకులో పనిచేశాను. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆరేడు సార్లు స్టేషన్ కు వెళ్లాను. టీడీపీ, జనసేనతో పాటు ప్రజలను కూడా తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టారు. అందుకే పాదయాత్రలో దొంగకేసులు ఎత్తివేస్తానని శిలాఫలకం వేశాను.

పవన్ వాలంటీర్ల గురించి మాట్లాడితే క్రిమినల్ కేసు పెట్టారు. చంద్రబాబును 53 రోజులు జైలుకు పంపారు, నారాయణను వేధించారు. వీటన్నిటికీ మేం వచ్చాక ఫుల్ స్టాప్ పెడతాం.

మూడేళ్లలో నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తాం

చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ ను గట్టిగా నమ్మారు. సీమెన్స్ తో ఒప్పందం చేసుకున్నాం. ఐటీతో పాటు బ్లూ కాలర్ స్కిల్స్ కూడా నేర్పించాం. ఆర్ఎఫ్ పీలో స్పష్టంగా చెప్పాం. అందువల్లే తప్పుడు ఆరోపణలతో సీఐడీ కోర్టులో చార్జిషీటు వేసినా తీసుకోలేదు. మొదటి వంద రోజుల్లో స్కిల్ డెవలప్ మెంట్ తెస్తాం. మా వద్ద ఉన్న అద్భుత దీపం పేరు సీబీఎన్, రాష్ట్ర ప్రజలకు కష్టాల్లోనే చంద్రబాబు గుర్తుకు వస్తారు. 

2014లో సీఎం అయ్యాక సంక్షేమం, అభివృద్ధిని సమంగా ముందుకు తీసుకెళ్లారు. రూ.200 పెన్షన్ రూ.2 వేలు చేశారు, పరిశ్రమలు తెచ్చారు. ఆదాయం పెంచి అభివృద్ధి చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక అదే ఒరవడిని ముందుకు తీసుకెళతాం. నెల్లూరుకు ఐటీతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తెచ్చే బాధ్యత నాది. 

కర్నూలులో ఎయిర్ పోర్టు కట్టింది చంద్రబాబు, విజయవాడ విమానాశ్రయాన్ని విస్తరించింది చంద్రబాబు. విజయవాడ ఎయిర్ పోర్టు అభివృద్ధికి గత ప్రభుత్వం భూసేకరణ చేస్తే ఈ ప్రభుత్వం ఆపేసింది. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూసేకరణ చేసి జీఎంఆర్ కు ఇచ్చింది కూడా చంద్రబాబే. నెల్లూరుకు ఇంకా పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. మొదటి మూడేళ్లలో నెల్లూరుకు ఎయిర్ పోర్టు తెస్తాం.

నెల్లూరులో వార్ వన్ సైడ్ ఖాయం

నెల్లూరును నారాయణ ఎలా అభివృద్ధి చేశారో చూశాం.4,500 కోట్లతో అభివృద్ధి చేశారు. భూగర్భ డ్రైనేజి, పేదలకు 4 వేల ఇళ్లు నిర్మించారు. 43 వేల ఇళ్లకు శంకుస్థాపన చేశారు. భూగర్భ డ్రైనేజి పెండింగ్ పనులు పూర్తి చేయలేని దద్దమ్మ సర్కారు జగన్ ప్రభుత్వం. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీకి 10కి 10 ఇవ్వండి... అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తాం. ఈ ప్రభంజనం చూస్తుంటే నెల్లూరులో వార్ వన్ సైడ్ ఖాయం. 

టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తే నెల్లూరులో ట్రిపుల్ ఇంజన్ అభివృద్ధి

సింహపురి యూత్ పవర్ అదిరిపోయింది. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా నెల్లూరు వాళ్లే ఉంటారు. బిజినెస్ లు పెట్టి అభివృద్ధి చేయాలన్నది నెల్లూరు డీఎన్ఏలోనే ఉంది. నారాయణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా ఉన్నతికి 'నారాయణే' కారణం. నెల్లూరును ఎలా అభివృద్ధి చేశారో మీకు తెలుసు. ఆయనను భారీ మెజారిటీతో గెలిపించండి. నెల్లూరు, మంగళగిరి పోటీపడి అభివృద్ధి చేస్తాం. 

వేమిరెడ్డి వైసీపీలో ఉన్నపుడు కూడా ఆయన సేవా కార్యక్రమాలు చూశాను. ఆయన ద్వారా ప్రేరణ పొందాను. స్వంత నిధులతో గ్రామాల్లో తాగునీటి పథకాలు అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వ విధానం నచ్చక రాజీనామా చేసి వచ్చి,  టీడీపీ తరపున లోక్ సభ ఎంపీగా పోటీచేస్తున్నారు. భారీ మెజారిటీతో ఆయనను లోక్ సభకు పంపండి. హైదరాబాద్, సికింద్రాబాద్ మాదిరిగా నెల్లూరు సిటీ, రూరల్ అభివృద్ధి చేస్తాం. 

ఏ2తో జాగ్రత్త!

వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయి నిలబడుతున్నారు. జగన్ అన్ని కుంభకోణాల్లో ఆయన ఏ2 గా ఉన్నారు. విశాఖను సర్వనాశనం చేసిన వ్యక్తి, గీతం విద్యాసంస్థలను నాశనం చేయాలని కంకణం కట్టుకున్న వ్యక్తి, రుషికొండకు గుండుకొట్టిన వ్యక్తి విజయసాయి రెడ్డి. విశాఖలో ఖాళీ భూములు కబ్జాచేసిన వ్యక్తి నెల్లూరులో నిలబడుతున్నారు. ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేసుకోండి... అంటూ నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

More Telugu News