కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై తీవ్రంగా స్పందించిన పాడి కౌశిక్ రెడ్డి

Padi Koushik Reddy condemns joining congress
  • గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్‌తోనే ఉంటానని స్పష్టీకరణ
  • తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్ట్‌లందరి పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరిక
  • త్వ‌ర‌లో లీగ‌ల్ నోటీసులు పంపిస్తానన్న కౌశిక్ రెడ్డి
తాను కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా జరుగుతున్న ప్రచారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పందించారు. మంగళవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తాను కేసీఆర్‌తోనే ఉంటానని ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్‌లోనే ఉంటానని స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరబోతున్నట్లుగా జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. 

'తెలంగాణ ప్ర‌జ‌ల‌కు, హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు న‌మ‌స్కారం.. ఇవాళ పొద్దున్నే లేవ‌గానే... సోష‌ల్ మీడియాలో ఒక వార్త చూశాను... నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న‌ట్లు ఒక వార్త వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ప్రజలందరికీ స్ప‌ష్టంగా తెలియ‌జేస్తున్నాను... నా గొంతులో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు కేసీఆర్‌తో, వారి కుటుంబంతో ఉంటాను. వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇలాంటి చిల్ల‌ర వార్త‌లు ద‌య‌చేసి రాయొద్ద‌ని జ‌ర్న‌లిస్టుల‌ను కూడా కోరుతున్నాన'ని పేర్కొన్నారు.

ఇలాంటి అసత్య ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆ వీడియోలో పేర్కొన్నారు. తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్ట్‌లందరి పైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. త్వ‌ర‌లో లీగ‌ల్ నోటీసులు పంపిస్తానని... పరువునష్టం దావా వేస్తానని తెలిపారు. ఇలాంటి చిల్ల‌ర వార్త‌ల‌ను ఎవ‌రూ న‌మ్మొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు.
Advertisement
Padi Kaushik Reddy
Congress
BRS
Telangana

More Telugu News