'యువగళం' పాదయాత్ర ఈ నెల 27న పునఃప్రారంభిస్తున్నా: నారా లోకేశ్
- చంద్రబాబు అరెస్ట్ తో ఆగిపోయిన లోకేశ్ యువగళం పాదయాత్ర
- మళ్లీ కొనసాగించేందుకు సన్నాహాలు
- రాజోలు నియోజకవర్గం నుంచి పునఃప్రారంభం
తన పాదయాత్రపై లోకేశ్ స్పందించారు. మీ అందరి ఆశీస్సులతో యువగళం పాదయాత్రను ఈ నెల 27న పునఃప్రారంభిస్తున్నానని వెల్లడించారు. యుద్ధం మొదలైంది అంటూ సమరశంఖం పూరించారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దీనికి సంబంధించిన వివరాలు తెలిపారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఈ నెల 27న పునఃప్రారంభం అవుతుందని వెల్లడించారు. తొలిరోజున కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడ నుంచి ప్రారంభమై తాటిపాక సెంటర్ వరకు పాదయాత్ర జరుగుతుందని వివరించారు. తాటిపాక సెంటర్ లో బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. సభ అనంతరం తిరిగి పాదయాత్ర కొనసాగుతుందని ప్రత్తిపాటి పేర్కొన్నారు.
15 కిలోమీటర్ల మేర పాదయాత్ర అనంతరం లోకేశ్ యువగళం పాదయాత్ర అమలాపురం నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని వెల్లడించారు.