Advertisement

కేసీఆర్ కు సవాల్ విసిరిన సీపీఐ నారాయణ.. జగన్ పై తీవ్ర విమర్శలు!

CPI Narayana challenge to KCR
  • లిక్కర్ స్కామ్ లో కవితను తప్పించేందుకు బీజేపీతో కేసీఆర్ చేతులు కలిపారన్న నారాయణ
  • కేసీఆర్ కు దమ్ముంటే ఓయూలో ఓట్లు అడగాలని సవాల్
  • కేసుల కోసం మోదీ కాళ్ల ముందు జగన్ తలవంచారని విమర్శ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ నుంచి కాపాడుకోవడానికి బీజేపీతో చేతులు కలిపారని ఆరోపించారు. స్కామ్ నుంచి కవితను తప్పించడానికి బీజేపీకి దాసోహమయ్యారని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందంలో భాగంగానే కవితను అరెస్ట్ చేయలేదని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం మూడు పార్టీలు ఒకటేనని చెప్పారు. 

కేసీఆర్ కు దమ్ముంటే తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియా యూనివర్శిటీకి వచ్చి ప్రచారం చేయాలని, ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఒకే దెబ్బకు మూడు పిట్టలు పడిపోతాయని... బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంలు ఓడిపోవడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు. ఖమ్మం సీపీఐ కార్యాలయంలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. తన కేసుల కోసం ప్రధాని మోదీ కాళ్ల ముందు ఆయన తల వంచారని అన్నారు. కేంద్రం కాళ్లపై పడటం వల్లే పదేళ్లుగా బెయిల్ పై ఉన్నారని చెప్పారు. మన దేశంలో ఇంతకాలం బెయిల్ పై ఉన్న ఏకైక వ్యక్తి జగన్ మాత్రమేనని అన్నారు. మరోవైపు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సీపీఐ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
CPI Narayana
KCR
BRS
K Kavitha
Jagan
YSRCP
Telangana

More Telugu News