పార్టీ మారారని విమర్శిస్తున్నవారికి కౌంటర్ ఇచ్చిన విజయశాంతి
- బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని మాటిచ్చి బీజేపీ నాయకులు పట్టించుకోలేదని వ్యాఖ్య
- చర్యలు ఉంటాయని బండి సంజయ్, కిషన్రెడ్డితోపాటు పలువురు చెప్పారని పేర్కొన్న రాములమ్మ
- ట్విటర్ వేదికగా స్పందించిన కాంగ్రెస్ నేత
బీఆర్ఎస్తో బీజేపీ అవగాహన కుదుర్చుకుందని తెలిసే కదా ఇంతమంది నాయకులు రాజీనామాలు చేసి బయటకెళ్లారని ఆమె విమర్శించారు. బీజేపీ నేతలు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్పై చర్యలు తీసుకుంటామని కేంద్ర పెద్దలతో హామీ ఇప్పించి చేర్చుకున్నది నిజం కాదా? అని ఆమె ప్రశ్నించారు.
తెలంగాణలో దుర్మార్గ పాలన పోవాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ బాగుంటే చాలు అన్న ఒకే ఒక్క కారణంతో ఏళ్లుగా పనిచేసిన కాంగ్రెస్ను వదిలి బీజేపీలోకి వెళ్లామని ఆమె పేర్కొన్నారు. కానీ, బీజేపీ నేతలు మాట నిలబెట్టుకోక పోగా తమను మోసగించారని విజయశాంతి అభివర్ణించారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 7 సంవత్సరాలు జెండా మోసి తాను కొట్లాడానని ఆమె అన్నారు.