Pawan Kalyan: సీఎం ఎవరనే ప్రశ్నకు నారా లోకేశ్, పవన్ కల్యాణ్ ఏం సమాధానం చెప్పారంటే..!

Nara Lokesh and Pawan kalyan responds on who is CM candidate
  • సమన్వయ కమిటీ భేటీలో పదవుల గురించి చర్చించలేదన్న లోకేశ్ 
  • రాష్ట్ర ప్రజల సమస్యలు, భవిష్యత్ గురించే మాట్లాడాని వెల్లడి 
  • పదవుల గురించి తర్వాత మాట్లాడుకుంటామన్న పవన్ 
రాజమండ్రిలో సోమవారం జరిగిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆసక్తికర సమాధానాలిచ్చారు. సీఎం అభ్యర్థి ఎవరని ప్రశ్నించగా లోకేశ్ స్పందిస్తూ.. ఈ సమావేశంలో ప్రజల సమస్యలపై చర్చించామని, పదవుల గురించి కాదని స్పష్టం చేశారు. ప్రజలకు ఏం మేలు చేయాలో చర్చించామని, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడామని, మంత్రి పదవులు, ఇతర పదవుల కోసం ఈ మీటింగ్ పెట్టుకోలేదని అన్నారు.

ఇక ఇదే ప్రశ్నపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ..రాష్ట్ర భవిష్యత్ పైనే ఈ సమావేశంలో నిర్ణయం జరిగిందని, ముందు కావాల్సింది ప్రజలకు భద్రత, సంక్షేమం, అభివృద్ధి మాత్రమేనని అన్నారు. పదవుల గురించి తర్వాత మాట్లాడుకుంటామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత, భద్రత మీదే చర్చలు జరిగాయన్నారు.

పవన్, లోకేశ్ ఉమ్మడిగా ప్రచారానికి వెళ్లే అవకాశం ఉందా? అని విలేకర్లు ప్రశ్నించగా జనసేనాని స్పందించారు. ప్రచారం రెండు మూడు విడతలుగా ఉంటుందని చెప్పారు. మొదటి విడతలో జనసైనికులు, టీడీపీ శ్రేణులు ఉమ్మడిగా కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కార్యకర్తలతోపాటు తమ సీనియర్ నాయకులు కూడా ఉంటారని చెప్పారు. రెండు పార్టీలు ఉమ్మడిగా ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై రెండవ సమావేశంలో చర్చిస్తామని పవన్ వివరించారు.
Pawan Kalyan
Nara Lokesh
Telugudesam
Janasena
Andhra Pradesh

More Telugu News