భూమా అఖిలప్రియ నిరాహార దీక్ష భగ్నం

police ends protest of Bhuma akhila priya
  • నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద మాజీ మంత్రి అఖిలప్రియ దీక్ష
  • రెండు రోజులుగా నిరసన దీక్ష నిర్వహిస్తున్న వైనం
  • శనివారం ఉదయం అఖిలప్రియ దీక్షను భగ్నం చేసిన పోలీసులు
  • ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం స్వగృహానికి తరలింపు
  • ఇంట్లోనే నిరాహార దీక్ష కొనసాగిస్తామన్న అఖిలప్రియ 
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. నంద్యాలలో టీడీపీ అధినేతను అరెస్టు చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద ఆమె రెండు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి సైతం నిరవధిక నిరాహార దీక్షలో కూర్చున్నారు. 

ఈ క్రమంలో పోలీసులు శనివారం తెల్లవారుజామున ఆమె దీక్షను భగ్నం చేశారు. అనంతరం, నంద్యాల డీఎస్పీ మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అఖిలప్రియను పోలీసులు ఆళ్లగడ్డలోని ఆమె నివాసానికి తరలించారు. ఇంట్లోకి వెళ్లేందుకు నిరాకరించిన ఆమె పోలీసుల వాహనంలోనే దీక్ష కొనసాగిస్తానని పట్టుబట్టారు. ఈ క్రమంలో అఖిలప్రియ, విఖ్యాత్‌రెడ్డికి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు జరిపించిన అనంతరం ఆమె నివాసానికి తరలించారు. 

కాగా, పోలీసుల తీరుపై అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బలవంతంగా తీసుకొచ్చి ఇంటిదగ్గర వదిలేశారని ఆరోపించారు. తమ నిరవధిక నిరాహార దీక్షను ఆపే ప్రసక్తే లేదని, ఇంటి నుంచే కొనసాగిస్తామని చెప్పారు. తనకు, తన తమ్ముడికి ఆరోగ్య సమస్యలు వస్తే దానికి నంద్యాల ఎస్పీ, డీఎస్పీ బాధ్యత వహించాలని అన్నారు.
Advertisement
Bhuma Akhila Priya

More Telugu News